Andhra Pradesh: కళ్యాణమస్తు పథకానికి టెన్త్ క్లాస్ నిబంధన మస్ట్.. ఎందుకో చెప్పిన సీఎం జగన్
అంగన్వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్తో ఉన్న పోస్టర్ను ప్రతి అంగన్వాడీలో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
AP News: బాల్య వివాహాలను కట్టడి చేసేందుకే కళ్యాణమస్తు పథకానికి టెన్త్ క్లాస్ నిబంధన విధించామని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) తెలిపారు. అందుకే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా 10 వ తరగతి పాస్ అవ్వాలనే రూల్ పెట్టినట్లు వెల్లడించారు. అంగన్వాడీల నిర్వహణ, దివ్యాంగుల సంక్షేమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు భాష, ఉచ్ఛారణపై బోధన అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన వస్తువుల కొనుగోలు, పంపిణీ విధానాన్ని సీఎం పరిశీలించారు. అందులో ఉన్న లోపాలు సరిదిద్దాలని, కొనుగోళ్లపై థర్డ్పార్టీతో తనిఖీ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్నే వినియోగించాలన్నారు. అంగన్వాడీల నిర్వహణలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లైంట్ చేయడానికి ప్రత్యేక నంబర్తో ఉన్న పోస్టర్ను ప్రతి అంగన్వాడీలో ఉంచాలన్నారు. సెప్టెంబరు 30 కల్లా అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ఇక దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ను ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. వారికి అవసరమైన సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. ఇక జువైనల్ హోమ్స్ మోనెటరింగ్ చేసేందుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించనుంది ప్రభుత్వం. ఈ రివ్యూ మీటింగ్లో మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..