అగ్రిగోల్డ్ భాదితులకు కొంత ఊరట
మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులకు లబ్ధి చేకూరనుంది. బాధితులు కొన్నాళ్లుగా తాము కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును దక్కించుకునేందుకు భారీగా ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని న్యాయస్థానం ఆదేశించినా ఆస్తుల వేలం విషయంలో చోటు చేసుకుంటున్న జాప్యం వారిని ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని పేద, దిగువ మధ్యతరగతి వారు కూడా సంస్థలో పొదుపు చేసుకున్నారు. అవి ఎంతకు తిరిగి రాకపోయేసరికి […]
మచిలీపట్నం:
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులకు లబ్ధి చేకూరనుంది. బాధితులు కొన్నాళ్లుగా తాము కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును దక్కించుకునేందుకు భారీగా ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని న్యాయస్థానం ఆదేశించినా ఆస్తుల వేలం విషయంలో చోటు చేసుకుంటున్న జాప్యం వారిని ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని పేద, దిగువ మధ్యతరగతి వారు కూడా సంస్థలో పొదుపు చేసుకున్నారు. అవి ఎంతకు తిరిగి రాకపోయేసరికి వారు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఊరట కల్పించేలా రూ.10 వేలు, అంతకు తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వపరంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
ఇందుకోసం రూ.250 కోట్లను కేటాయిస్తూ ఈనెల 7న జీవో ఎంఎస్ నెం.31 విడుదల చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి హైకోర్టులో పిల్ ఉన్న నేపథ్యంలో రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి నగదు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ఆయా జిల్లాల్లోని న్యాయసేవాధికార సంస్థల ద్వారా డిపాజిట్ బాండ్ల పరిశీలన చేసి నగదు చెల్లించేందుకు అనుమతిస్తూ ఈనెల 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రూ.10 వేలు, అంతకు తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసుకున్న వారికి సొమ్ము చెల్లించేందుకు రూట్ క్లియరైంది. బాధితులు తమ ఒరిజనల్ బాండ్లు, రసీదులు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఏదైనా గుర్తింపు కార్డులను జిల్లా న్యాయసేవాధికార సంస్థ పరిశీలన నిమిత్తం సమర్పించాల్సి ఉంటుంది.
సీఐడీ అడిషనల్ డీజీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తాజాగా ఈ విషయాలను వెల్లడించారు. బాధితులు పరిశీలన నిమిత్తం అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పత్రాల పరిశీలన చేసే స్థలం, తేదీ త్వరలో ప్రకటిస్తారన్నారు. అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వం కల్పించిన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.