జేడీయూ అభ్యర్థులపైనే పోటీకి దిగుతామంటున్న పాశ్వాన్
లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యూహమేమిటి? ఎన్డీఎ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన కేవలం జేడీయూపైనే ఎందుకు కక్ష కట్టినట్టు? నితీశ్కుమార్తో ఎందుకు తగువు పడుతున్నట్టు? ఇది బీజేపీ అధినాయకత్వం మాస్టర్ ప్లానా..? ఈ ప్రశ్నలు బీహార్ రాజకీయాలను ఊపేస్తున్నాయి.. అసలే పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలతో పార్టీలన్నీ తలమునకలుగా ఉన్న తరుణంలో ఎల్జేపీ తీసుకున్న స్టాండ్ కాకపుట్టిస్తోంది. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య సీట్ల పంపకం ఆల్మోస్టాల్ ఓ […]
లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వ్యూహమేమిటి? ఎన్డీఎ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన కేవలం జేడీయూపైనే ఎందుకు కక్ష కట్టినట్టు? నితీశ్కుమార్తో ఎందుకు తగువు పడుతున్నట్టు? ఇది బీజేపీ అధినాయకత్వం మాస్టర్ ప్లానా..? ఈ ప్రశ్నలు బీహార్ రాజకీయాలను ఊపేస్తున్నాయి.. అసలే పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలతో పార్టీలన్నీ తలమునకలుగా ఉన్న తరుణంలో ఎల్జేపీ తీసుకున్న స్టాండ్ కాకపుట్టిస్తోంది. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య సీట్ల పంపకం ఆల్మోస్టాల్ ఓ కొలిక్కి వచ్చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్షాల కూటమిలో కూడా సీట్ల పంపకం పూర్తయ్యింది.. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కూటమి అంగీకరించడం విశేషం.. మొన్నటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ను ఒప్పుకునే ప్రసక్తే లేదన్న వామపక్షాలు ఇప్పుడు ఓకే చెప్పాయి. రాష్ట్రీయ జనతాదళ్ 144 స్థానాల నుంచి పోటీ చేయబోతున్నది.. కాంగ్రెస్ 70 స్థానాల్లో బరిలో దిగబోతున్నది.. సీపీఐ ఎంఎల్ 19 చోట్ల, సీపీఎం నాలుగు చోట్ల పోటీ చేస్తున్నాయి.. నిన్నటి వరకు అన్నిస్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పిన లోక్జనశక్తి పార్టీ ఇప్పుడు కేవలం జేడీయూ అభ్యర్థుల మీదనే పోటీకి దిగుతామని చెప్పడం గమనార్హం. ఎన్డిఏ నుంచి బయటకు వచ్చినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పార్టీ నాయకత్వానికి విధేయులుగానే ఉంటామని పాశ్వాన్ చెప్పడం విశేషం. బీహార్లో సొంతంగా బరిలోకి దిగుతామని ప్రకటించిన ఎల్జేపీ నాయకత్వం తమ పోటీ జేడీయూపైనే అనే చెప్పడమే కాకుండా బీజేపీ అభ్యర్థుల విజయానికి కృష్టి చేస్తామని ప్రకటించింది. బీహార్లో నితీశ్ కుమార్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు బీజేపీనే రామ్విలాస్ పాశ్వాన్ ఆస్ర్తంగా ప్రయోగిస్తున్నదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.పాశ్వాన్ నిర్ణయం వెనుక బీజేపీ అధినాయకత్వం ఉందని కొందరు అంటున్నారు. జేడీయూ అభ్యర్థులు ఎంత ఎక్కువగా ఓడితే బీజేపీకి అంత లాభం.. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తే ఆటోమాటిక్గా ముఖ్యమంత్రి పీఠం లభిస్తుందన్నది బీజేపీ పెద్దల ఆలోచన. పాశ్వాన్ కేవలం బీహార్ వరకే ఎన్డీయే నుంచి బయటకు రావడమేమిటో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు నేతలు. ఇప్పటి వరకు ఎల్జేపీ నేతలు నితీశ్కుమార్పై విమర్శలు కురిపిస్తున్నారే తప్ప బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఎల్జేపీని తమపై పోటీకి దింపుతుందన్న అనుమానం జేడీయూ నేతలకు కలుగుతుంది.. వారంతా బీజేపీపై ఒకింత కోపంగానే ఉన్నారు.