కదలనంటే కదలను.. ప్రియాంక గాంధీ మంకుపట్టు
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీలోని మీర్జాపూర్ లో గల గెస్ట్ హౌస్ లో రాత్రంతా ” జాగారం ” చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంటా 15 నిముషాల ప్రాంతంలో ఆమెను కలిసి సీనియర్ పోలీసు, ప్రభుత్వ అధికారులు వెళ్లిపోయారు. సోనాభద్ర గ్రామ ఘటనలో మృతులు, గాయపడినవారి కుటుంబాలను పరామర్శించేంత వరకు తాను కదిలేది లేదని ఆమె మంకుపట్టు పడుతున్నారు. దీంతో చేసేదిలేక అధికారులు అక్కడినుంచి నిష్క్రమించారు. వారణాసి అదనపు డీజేపీ బ్రిజ్ భూషణ్, ఇతర […]
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీలోని మీర్జాపూర్ లో గల గెస్ట్ హౌస్ లో రాత్రంతా ” జాగారం ” చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంటా 15 నిముషాల ప్రాంతంలో ఆమెను కలిసి సీనియర్ పోలీసు, ప్రభుత్వ అధికారులు వెళ్లిపోయారు. సోనాభద్ర గ్రామ ఘటనలో మృతులు, గాయపడినవారి కుటుంబాలను పరామర్శించేంత వరకు తాను కదిలేది లేదని ఆమె మంకుపట్టు పడుతున్నారు. దీంతో చేసేదిలేక అధికారులు అక్కడినుంచి నిష్క్రమించారు. వారణాసి అదనపు డీజేపీ బ్రిజ్ భూషణ్, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారని, నిరసనను విరమించి తిరిగి వెళ్లిపోవలసిందిగా కోరారని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
వారు గంట సేపు తనతో మాట్లాడారని, అయితే తనను ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారో చెప్పేందుకు నిరాకరించారని ఆమె పేర్కొన్నారు. వాళ్ళు నాకు ఎలాంటి డాక్యుమెంట్లూ ఇవ్వలేదు అని ఆమె తెలిపారు. తన అరెస్టు అక్రమమని లాయర్లు చెప్పారని పేర్కొన్న ఆమె..సోనాభద్ర ఘటన తాలూకు బాధితులను నేను కలుసుకునేందుకు మాత్రం వీలు లేదని ఖండితంగా స్పష్టం చేశారని అన్నారు. ప్రియాంకను కలిసి… అధికారులు తిరిగి వెళ్లిపోతున్న వీడియోను ఆమె ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ వెంట రాత్రంతా ఆమెతో బాటు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ప్రియాంకను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ ఒకదశలో పోలీసులతో వాగ్యుధ్ధానికి దిగారు. అయితే వారి ప్రశ్నలకు ఖాకీలు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. సోనాభద్ర గ్రామంలో ఇటీవల భూ తగాదాల నేపథ్యంలో.. రెండు వర్గాల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకోగా 10 మంది మృతి చెందారు.24 మంది గాయపడ్డారు.
ADG Varanasi, Commissnor Varanasi division and other senior Police & Govt officials leaving Chunar Qila at 1.15 am pic.twitter.com/ceyk4Rg2k0
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2019
దాదాపు 200 మంది గ్రామస్తులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. మూకలు యధేచ్చగా గన్స్ తో కాల్పులు జరుపుకోవడం యూపీలోని గన్ కల్చర్ ని ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోలేకపోతోందన్న వాస్తవాన్నికళ్ళకు కట్టింది. కాగా-సోనాభద్ర ఘటనను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఒక భూవివాదాన్ని, ఆ సందర్భంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కొందరు మరణిస్తే.. సానుభూతి పేరిట అక్కడ ‘ రచ్ఛ’ చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కమలం పార్టీ దుయ్యబడుతోంది.