రోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఓ మహిళ నడిరోడ్డుపై ప్రసవించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత నెల పదిహేను రోజులుగా ఉపాధి లేక, చేతిలో చాలిచాలని డబ్బులతో అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వలస కూలీలు, కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇతర ప్రాంతాల్లో ఉండలేక, సొంతూళ్లకు వెళ్లేందుకు బయల్దేరుతున్నారు. రవాణా సదుపాయం అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు వాహనాలు కూడా లేని పరిస్థితుల్లో వారంతా కాలినడకనే వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. మహిళలు, చిన్నపిల్లలు సహా రోడ్ల వెంట బారులు తీరి వెళ్తున్నారు. అలా బయల్దేరిన ఓ మహిళ నడిరోడ్డుపై ప్రసవించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పూర్తి వివరాలు పరిశీలించగా….
చత్తీస్గఢ్కు చెందిన అనిత, లోకేష్ దంపతులు వారి స్వస్థలానికి వెళ్లేందుకు కాలినడకన బయల్దేరారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ మీదుగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న అనితకు పురిటి నొప్పులు రావటంతో నడిరోడ్డుపైనే ప్రసవించింది. విషయం తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లీ బిడ్డను రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.