ఇన్‌స్టా, FB అడిక్షన్‌.. ఆ యువతిలో మానసిక సమస్యలు!

Updated on: Mar 29, 2026 | 12:26 PM

అమెరికాలో మెటా, గూగుల్ సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను కావాలనే వ్యసనపరులుగా మారుస్తున్నాయనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్ కోర్టు జ్యూరీ తీర్పు చెప్పింది. బాధిత యువతికి $6 మిలియన్ల (దాదాపు ₹50 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యువత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం, టెక్ దిగ్గజాల బాధ్యతను ఈ తీర్పు హైలైట్ చేస్తుంది.

అమెరికాలో మెటా, గూగుల్ సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మాతృసంస్థలైన మెటా ఇంకా గూగుల్‌ వినియోగదారులను కావాలనే వ్యసనపరులుగా మారుస్తున్నాయనీ పిల్లలు, టీనేజర్ల పై వాటి ప్రభావం గురించి హెచ్చరించడంలో విఫలమయ్యాయని లాస్ ఏంజిల్స్ కోర్టు జ్యూరీ చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఈ కేసులో బాధితురాలైన యువతికి 6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేలీ అనే 20 ఏళ్ల యువతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దావా వేసింది. చిన్నతనం నుంచే ఈ ప్లాట్‌ఫామ్‌ల వాడకం మొదలుపెట్టి, సంవత్సరాల తరబడి వాటికి బానిసగా మారానని ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. దీనివల్ల తాను తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, తన పొటోలకు ఫిల్టర్లు విపరీతంగా వాడి బాడీ డిస్మార్ఫియా వంటి మానసిక సమస్యలతో బాధపడ్డానని తెలిపింది. ఆరేళ్ల వయసులో యూట్యూబ్ వీడియోలు చూడటం, తొమ్మిదేళ్లకే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవడం చేశానని చెప్పింది. “ఎప్పుడూ వాటిపైనే ఉండాలనిపించేది. వాటిని చూడకపోతే ఏదో కోల్పోతున్నాననే భావన కలిగేది” అని ఆమె కోర్టుకు వివరించింది. యువతి తరఫు న్యాయవాది మార్క్ లానియర్ వాదిస్తూ, ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ఆకట్టుకునేలా తమ ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాయని ఆరోపించారు. “వారికి తెలుసు! వాళ్లు పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నారు” అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష విధించాలని కోరారు. అయితే, ఈ ఆరోపణలను మెటా, గూగుల్ యాజమాన్యాలు తోసిపుచ్చాయి. బాధితురాలి మానసిక సమస్యలకు వ్యక్తిగత పరిస్థితులు, స్కూల్‌లో ఎదురైన బెదిరింపులు కూడా కారణమై ఉండవచ్చని వాదించాయి. తమ ప్లాట్‌ఫామ్‌లు వ్యసనం కలిగించేలా రూపొందించలేదని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. వినియోగదారుల సమయాన్ని పెంచడం తమ లక్ష్యం కాదని, వారికి ఉపయోగపడే సేవలు అందించడమే తమ ఉద్దేశమని జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ‌తామని మెటా, గూగుల్‌ ప్రకటించాయి. యువత మానసిక ఆరోగ్యం చాలా సంక్లిష్టమైన అంశమని, దానికి ఒకే యాప్‌ను కారణంగా చూపలేమని మెటా అంటోంది. మరోవైపు యూట్యూబ్ ఒక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమేనని, సోషల్ మీడియా సైట్ కాదని గూగుల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే మెటా, యూట్యూబ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌పై 3,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజా తీర్పు ఆ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, మరిన్ని సెటిల్‌మెంట్లకు దారితీయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!

Follow Us