కనీసం ముగ్గురు పిల్లల్ని అయిన కనండి మాహప్రభో.. మస్క్ ఆవేదన

Updated on: Jul 01, 2025 | 7:37 PM

టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచం జనాభా సంక్షోభం దిశగా పయనిస్తోందని, వేగంగా పడిపోతున్న జననాల రేటు మానవాళి మనుగడకే పెను ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను ఎక్కువగా కనడం ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడగలమని ఆయన పిలుపునిచ్చారు.

ఎక్స్ వేదికగా ఓ వినియోగదారు చేసిన పోస్టుకు మస్క్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫార్చ్యూన్ నివేదికను ప్రస్తావిస్తూ.. జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఒక మహిళకు సగటున 2.1 మంది పిల్లలు సరిపోరని, ఆ సంఖ్య 2.7గా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రేటు 1.66గా ఉండగా, ఇటలీలో 1.29, జపాన్‌లో 1.3గా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లలు లేనివారు, లింగ అసమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త సంఖ్యను నిర్ధారించినట్లు తెలిపారు. ఈ పోస్టును రీపోస్ట్ చేసిన మస్క్ “పిల్లలు లేనివారు లేదా ఒక్కరే బిడ్డ ఉన్నవారి లోటును భర్తీ చేయాలంటే, పిల్లలు ఉన్నవారు కచ్చితంగా ముగ్గురిని కనాలి. లేకపోతే జనాభా కుప్పకూలిపోతుంది” అని వ్యాఖ్యానించారు. తన మాటలను ఇప్పుడు నమ్మకపోయినా, 20 ఏళ్లలో నిజం తెలుస్తుందని ఆయన హెచ్చరించారు. జననాల రేటు తగ్గడానికి, గతంలో నాగరికతలు అంతరించిపోవడానికి మధ్య బలమైన సంబంధం ఉందని మస్క్ ఎప్పటినుంచో వాదిస్తున్నారు. పురాతన రోమ్ పతనానికి తక్కువ జననాల రేటే ప్రధాన కారణమని, కానీ చాలా మంది చరిత్రకారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. మస్క్‌కు ప్రస్తుతం 14 మంది సంతానం ఉండటం గమనార్హం. మస్క్ ఆందోళనలకు బలం చేకూరుస్తూ ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (UNFPA) నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయని ‘ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్’ పేరుతో విడుదలైన 2025 ప్రపంచ జనాభా నివేదికలో వెల్లడించింది. పిల్లల పెంపకం ఖర్చు విపరీతంగా పెరగడం, సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో జాప్యం వంటి కారణాలతో చాలా మంది కోరుకున్నంత మంది పిల్లలను కనలేకపోతున్నారని పేర్కొంది. ఈ నివేదికలో భారత్‌కు సంబంధించిన ఆందోళనకరమైన విషయాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.9కి పడిపోయిందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువని యూఎన్‌ఎఫ్‌పీఏ స్పష్టం చేసింది. “విద్యావకాశాలు మెరుగుపడటం, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం వల్ల 1970లో 5గా ఉన్న సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 2కి తగ్గింది. ఇది గొప్ప ప్రగతే అయినప్పటికీ, తగ్గుతున్న రేటు భవిష్యత్తులో సవాళ్లను విసరనుందని యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నార్ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్

అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..

పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..

చిల్లర లేదన్న ప్రయాణికుడు.. చితక బాదిన మహిళా కండక్టర్‌

కన్నప్ప నయా రికార్డ్ !! ఆదివారం ఒక్కరోజే 40% ఆక్యుపెన్సీ..