ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
వరంగల్ జనగామలో నాలుగేళ్ల శ్రీయాన్ రెండు విషసర్పాల కాటుతో మృతి చెందాడు. ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిని కట్లపాము, రక్తపింజర కాటేశాయి. తండ్రి పాములను చంపి ఆసుపత్రికి తీసుకెళ్లినా విషం పాకడంతో ఫలితం లేకపోయింది. తల్లిదండ్రుల రోదనలు తండాను విషాదంలో ముంచెత్తాయి. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
వరంగల్లోని జనగామలో విషాదం చోటుచేసుకుంది. విధి ఆ బాలుడి పట్ల అత్యంత క్రూరంగా మారింది. పగబట్టినట్లుగా రెండు విష సర్పాలు నిమిషాల వ్యవధిలో ఆ పసి ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. దేవరుప్పుల మండలంలోని లక్ష్మణ్ తండాకు చెందిన బాలాజీ, కవిత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. నాలుగేళ్ల శ్రీయాన్ శుక్రవారం రాత్రి వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆరుబయట నిద్రపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గాఢనిద్రలో ఉన్న ఆ చిన్నారిని కట్లపాము, రక్తపింజర కాటేశాయి. రెండు పాములు కరవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన బాలుడు, తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం సులభమవుతుందని భావించిన తండ్రి బాలాజీ, చీకట్లోనే ఆ పాముల కోసం గాలించాడు. ఆ రెండు పాములను వెతికి పట్టుకుని చంపేశాడు. వెంటనే ఆ పసివాడిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, అప్పటికే శరీరం అంతా విషం పాకడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం శ్రీయాన్ కన్నుమూశాడు. ముద్దులొలికే కుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. “రెండు పాములు పగబట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకున్నాయి” అంటూ వారు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే, తండా మొత్తం కన్నీరుమున్నీరైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Vijay: ‘వావ్’ అనిపించిన సీఎం విజయ్ తొలి ప్రసంగం
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే