వాలెంటైన్స్‌ డే రోజు విషాదం.. ప్రియురాలు మృతి

Updated on: Feb 15, 2026 | 11:39 AM

వాలెంటైన్స్‌డే.. ప్రేమికులకు పండగ రోజు.. ఈ రోజు వారి ఆనందానికి అవధులు ఉండవు.. ప్రేమికులు ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. విహారయాత్రలకు వెళ్తారు.. అలా తమ ప్రేమను మరింత బలపరుచుకోడానికి విహారయాత్రకు బయలు దేరాయి మూడు ప్రేమ జంటలు. ఎన్నో ఊహలతో, తోటి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తూ కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకోవాలనుకున్నారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఒకరి ప్రాణం గాలిలో కలిసిపోగా, మరొకరు ఆసుపత్రి పాలుయ్యారు. వాలెంటైన్స్ డే రోజున కడప సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

తిరుపతి నుంచి మూడు ప్రేమ జంటలు మూడు బైక్‌లపై కలిసి గండికోట సందర్శనకు బయలుదేరారు. మార్గమధ్యలో కడప నగర శివారులోని ఆలంఖాన్ పల్లె వద్దకు రాగానే, వేగంగా వచ్చిన ఒక లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకుడిని వెంటనే చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే ప్రియురాలు ప్రాణాలు విడవడం చూసి ఆ యువకుడు, తోటి స్నేహితులు తల్లడిల్లిపోయారు. వాలెంటైన్స్‌ డే రోజున ఆనందంగా గడపాల్సిన ఆ యువతీయువకులు, ఇలా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి స్థానికులు కన్నీరు పెట్టారు. అటవీ ప్రాంతం, కనువిందు చేసే గండికోట అందాలను చూడాలనుకున్న వారి కలలు కడప రోడ్డుపైనే కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!