కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
చైనాలోని జిలిన్ ప్రావిన్స్లో కొందరు దొంగలు అక్రమ శునక మాంసం విక్రయం కోసం ఏడు శునకాలను ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్లారు. ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, చివరికి తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యజమానుల వేర్వేరు జాతుల ఏడు కుక్కలపై దొంగల కళ్లుపడ్డాయి. దొంగలు వీటిని మూడు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోకి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కులోని బోను తలుపులు తెరుచుకుని ట్రక్ డోర్ నుంచి కిందకు దూకి చాకచక్యంగా బయటపడ్డాయి శునకాలు. సాధారణంగా అలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ అవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి.
చాంగ్చువాంగ్ హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఆ ఏడు కుక్కలు ఒక సైనిక దళంలా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదలలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడ్డాయి. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, దానికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి . చిన్నదైన కోర్గి కుక్క ముందుగా నడుస్తూ ఇతరులకు దారి చూపింది. మధ్యలో వెనక్కి చూస్తూ అంతా వస్తున్నారా అని నిర్థారించుకుని ముందుకు నడిచింది. .