అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో అరుదైన బాండెడ్ క్రైట్ పాము కనిపించడం కలకలం రేపింది. నలుపు, పసుపు రంగు చారలతో ఉన్న ఈ విషసర్పం రాత్రివేళ రోడ్డు దాటుతుండగా కనిపించింది. తెలంగాణలో ఇలాంటి పాముల దర్శనం అరుదుగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల్లో ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చన్న అనుమానాలపై ఆరా తీస్తున్నారు. పాము కనిపిస్తే దానిని చంపకుండా అటవీశాఖ లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన, అరుదైన ‘బాండెడ్ క్రైట్’ పాము ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న ఈ వింత పామును చూసి బాటసారులు మొదట భయాందోళనకు గురయ్యారు. నలుపు మరియు పసుపు రంగు చారలతో విభిన్నంగా ఉన్న ఈ పాము కాటుకు గురైతే మనుషుల ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ జాతి పాములు మనదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మాత్రమే చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అంతర్జాతీయంగా చైనా, నేపాల్, థాయ్లాండ్, వియత్నాం వంటి దేశాల్లో సంచరించే ఇవి, ఇక్కడికి ఎలా వచ్చాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. బహుశా లారీలు లేదా ఇతర వాహనాల్లో ప్రయాణించి ఈ ప్రాంతానికి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లోనూ ఇలాంటి పాము కనిపించడం గమనార్హం. పాకాల అడవుల తర్వాత ఇప్పుడు ఏటూరునాగారం అడవుల్లోనూ ఈ విషసర్పం సంచరిస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో ఎక్కువగా సంచరించే ఈ పాములు కనిపిస్తే ఎవరూ భయపడి వాటిని చంపవద్దని, వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!