చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పుట్టుకతో వచ్చిన షుగర్ వ్యాధి అదుపు తప్పటంతో.. ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ళ బాలిక మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవల్లిని చిన్నతనం నుంచే టైప్ 1 మధుమేహం పీడించింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీవల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది. జిల్లా మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు శ్రీవల్లి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలయినా సరే టైప్ 1 డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఆశ్రద్ద చూపకుండా చిన్నతనం నుంచే అన్ని వైద్య పరీక్షలు చేయిస్తుంటే ఎలాంటి వ్యాధికైనా తొలినాళ్ళలోనే చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు. నీరసంగా ఉండే చిన్నారులు, తీవ్ర అలసటకు గురయ్యే వారిని గుర్తించి డయాబెటిక్ ఉందా లేదా అని పరీక్షలు చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. చిన్నారుల్లో తొలినాళ్ళలోనే వ్యాధులను గుర్తించి సరైన చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చేయవచ్చంటున్నారు. టైప్ 1 డయాబెటిస్తో మృతి చెందిన బాలిక శ్రీవల్లి జంగంగుట్ల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నందున శ్రీవల్లి చదివిన పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. మెడికల్ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.