నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భాగ్యనగరంలోని పెట్రోల్ బంకుల వద్ద సెగలు పుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో నగరవాసులు ఒక్కసారిగా బంకుల వైపు పరుగులు తీశారు. బుధవారం ఉదయం నుంచే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
కూకట్పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, అమీర్పేట వంటి రద్దీ ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకని పరిస్థితి నెలకొంది. అధిక రద్దీ కారణంగా కొన్ని చోట్ల పెట్రోల్ అయిపోవడంతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడం మరింత ఆందోళనకు గురిచేసింది. బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు ఇంధన కొరతపై వస్తున్న వార్తలను నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ మరియు చమురు కంపెనీల అధికారులు స్పష్టం చేశారు. నగరంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, అనవసరంగా భయాందోళనలకు గురై బంకుల వద్దకు రావద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దంటూ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.