వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు

Updated on: Jan 08, 2026 | 12:28 PM

ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రమాదకర స్టంట్ చేశాడు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్తున్న రైలుకు వేలాడాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో RPF అప్రమత్తమైంది. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయవద్దని హెచ్చరించింది.

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని చాలామంది ప్రమాదకర స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఓ యువకుడు వేగంగా దూసుకెళ్తున్న రైలుకు వేళాడుతూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఓ యువకుడు ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ..ప్రమాదకర స్థితిలో వేగంగా దూసుకెళ్తున్న రైలుకు వేళాడుతూ ఫోజులిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసు అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే రైల్వే రంగంలోకి ఆర్‌పీఎఫ్‌ అధికారులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ముంబైలోని డాక్‌యార్డ్ రోడ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు నడుస్తున్న లోకల్ ట్రైన్‌ నుంచి బయటకు ఊగుతూ సినిమా స్టైల్‌లో స్టంట్ చేస్తూ కనిపించాడు. రైలు ప్రవేశ ద్వారం దగ్గర అంచున నిలబడి.. తనని తాను ఒక హుక్‌తో కూడిన తాడుతో రైలు ప్రవేశద్వారం హ్యాండిల్‌కి బంధించుకుని వేలాడుతూ హీరోలా పోజులు ఇచ్చాడు. ఏ మాత్రం అదుపుతప్పినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదకర స్థితిలో ఆ యువకుడు స్టంట్‌ చేశాడు. 2025, డిసెంబర్ 31న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో RPF ఐటీ సెల్ సాంకేతిక విచారణ ప్రారంభించింది. వీడియో లొకేషన్, డిజిటల్ ఆధారాలు ఇతర సమాచారంతో నిందితుడిని గుర్తించారు. అనంతరం RPF బృందం మస్జిద్ బందర్ ప్రాంతంలో యువకుడిని అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన యువకుడు బీహార్‌కు చెందిన బాబుల్‌గా గుర్తించారు. విచారణలో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాదకర స్టంట్ చేసినట్లు అతడు అంగీకరించాడు. తన తప్పును ఒప్పుకున్న యువకుడు క్షమాపణలు చెప్పి, వీడియోను తొలగిస్తూ ఇకపై ఇలాంటి చర్యలు చేయనని హామీ ఇచ్చాడు. RPF అధికారుల ప్రకారం, యువకుడి నిర్లక్ష్యం వల్ల అతని ప్రాణాలకే కాదు, రైలులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని, కఠిన హెచ్చరికతో నోటీసుపై విడిచిపెట్టారు. కదులుతున్న రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణాల్లో స్టంట్లు చేయడం చట్టవిరుద్ధమని, ఇవి తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తాయని RPF యువతకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో చేసే ఇలాంటి ప్రమాదకర చర్యలపై ఇకపై మరింత కఠిన చర్యలు ఉంటాయని RPF స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట

Published on: Jan 08, 2026 09:15 AM