వృద్ధ దంపతుల సాహసం.. ఐదేళ్లు శ్రమించి

Updated on: Nov 04, 2025 | 9:49 PM

కష్టే ఫలి అన్నారు పెద్దలు. పడిన కష్టానికి ఎప్పటికైనా ఫలితం దక్కితీరుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మధ్యప్రదేశ్‌కు చెందిన వృద్ధ దంపతులు ఐదేళ్ల పాటు శ్రమించి, ఎవరి సహాయం లేకుండా తమ చేతులతోనే బావిని తవ్వి అందరికీ ఆదర్శంగా నిలిచారు. టికమ్‌గఢ్‌ జిల్లా, జామునియా ఖేఢా గ్రామానికి చెందిన దీప్‌చంద్‌ ఆదివాసీ, ఆయన భార్య గౌరీబాయి ఈ ఘనత సాధించారు.

దీప్‌చంద్‌ వయస్సు 65 ఏళ్లు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలందరికీ వివాహాలు జరిపించి సెటిల్‌ చేసేసరికి వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో తమకున్న బంజరు భూమిని సాగులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా, సొంతంగానే బావి తవ్వకం ప్రారంభించారు. ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా కేవలం తమ శారీరక శక్తినే నమ్ముకుని ఐదేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. బావిలో నీటి ఊట పడింది. దీంతో ఆ భూమిలో సాగు పనులు కూడా ప్రారంభించారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఐదేళ్ల శ్రమ వృథా అయిపోయింది. బావికి కాంక్రీట్ పనులు పూర్తి చేయకపోవడంతో అది కూలిపోయి మట్టితో నిండిపోయింది. అయినా ఈ దంపతులు ఏమాత్రం నిరుత్సాహపడటం లేదు. నీటి మట్టం తగ్గగానే తిరిగి పనులు మొదలుపెట్టి, బావిని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓవైపు రోజుకూలీకి వెళ్తూనే ఈ పనులు చేస్తున్నామని వారు తెలిపారు. ఇంతటి పేదరికంలో ఉన్నా, ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు, పెన్షన్ వంటి కనీస సహాయం కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక

రక్షణ రంగం ఉత్పత్తులకు కేరాఫ్‌ గా హైదరాబాద్‌

ఏపీలో భిక్షాటనపై పూర్తి నిషేధం

బురద మీద పడిందని ఇలా బుద్ధి చెప్పింది..

వేలానికి బంగారు టాయిలెట్.. ధర ఎంతో తెలుసా