తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

Updated on: Dec 07, 2025 | 11:21 AM

విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. విమానాలు రద్దు అయినట్లు ఎయిర్‌పోర్ట్‌లో తెలుసుకున్న ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరికి ఉద్యోగం, మరొకరికి అనారోగ్యం, మరొకరికి ఏదో ఎమర్జెన్సీ. విమాన ప్రయాణాలు పెట్టుకున్న వీరంతా చివరి నిమిషంలో విమానాల రద్దు కావటంతో నానా ఇబ్బందులు పడ్డారు.

బెంగళూరుకి చెందిన నమితది హృదయ విదారక కథ. తండ్రి అస్థికలను గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు హరిద్వార్‌కు బయలుదేరిన నమిత బెంగళూరు విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. చేతుల మధ్య కలశం పట్టుకుని, చితాభస్మాన్ని హరిద్వార్‌లోని గంగా తీరంలో నిమజ్జనం చేయటానికి తనకు సాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంది.
తన తండ్రి చితాభస్మాన్ని తనతో తీసుకెళ్తున్నానని చెప్పింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి అక్కడ్నుంచి విమానంలో డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉందనీ అక్కడి నుంచి తన తండ్రి చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి హరిద్వార్‌కు వెళ్లాలని నమిత చెప్పింది. మరో నలుగురు కుటుంబ సభ్యులతో తాము హరిద్వార్ బయలుదేరామని, ఇప్పుడు మరో విమానం టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే..మనిషికి రూ. 60 వేలు అవుతుందని, తాము అంత భరించలేమని వాపోయింది. బెంగళూరు నుంచి రైలు లేదా బస్సు టిక్కెట్లు తీసుకుందామంటే.. అందుబాటులో లేవని నమిత తెలిపింది. హరిద్వార్ నుంచి తన స్వస్థలమైన జోధ్‌పూర్‌కు రిటర్న్‌ ఇప్పటికే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంది. విమానాల రద్దు కారణంగా అవి కూడా క్యాన్సిల్‌ అయ్యే పరిస్థితి.