నా శవాన్ని అమ్మానాన్నలకు చూపించొద్దు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
నంద్యాల జిల్లాలో చిరంజీవి అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. తన వల్ల తల్లిదండ్రులు అప్పులపాలయ్యారనే బాధతో అతడు హృదయ విదారక సూసైడ్ నోట్ రాశాడు. “నా శవాన్ని వారికి చూపించకండి” అంటూ రాసిన మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. పేదరికం, మానసిక ఒత్తిడి యువతపై చూపుతున్న ప్రభావాన్ని ఈ ఘటన మరోసారి బయటపెట్టింది.
“నేను నా తల్లిదండ్రులకు భారం అయ్యాను.. నా శవాన్ని వారికి అప్పగించి ఇబ్బంది పెట్టకండి.. కుక్కలకు వేయండి లేదా చెత్తకుప్పలో పడేయండి.. అంటూ ఓ యువకుడు రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. నంద్యాల జిల్లా పొన్నాపురం రైల్వే గేట్ వద్ద చిరంజీవి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అళ్ళగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన మున్నెయ్య దంపతులకు వరుసగా నలుగురు సంతానం కలిగారు. కానీ, వారంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోగా, ఐదో సంతానంగా చిరంజీవి జన్మించాడు. పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉండటంతో తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పు చేసి అతడిని కాపాడుకున్నారు. ప్రస్తుతం నంద్యాలలో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్న చిరంజీవి, తన వల్ల తల్లిదండ్రులు అప్పులపాలయ్యారనే ఆవేదనతో మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు ముందు చిరంజీవి తన మనోవేదనను లేఖ రూపంలో రాశాడు. “లక్షలు అప్పు చేసి నన్ను బతికించిన అమ్మనాన్నలకు నేను ఏమీ చేయలేకపోయాను. నా మృతదేహాన్ని కూడా వారికి చూపించకండి” అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్సై కుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేదరికం, నిరుద్యోగం యువతపై ఎంతటి మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది. ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే నిపుణుల సహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బులు డ్రా చేసుకోడానికి వెళ్తే హెయిర్కట్! వైరల్ అవుతున్న ‘సెలూన్ ఏటీఎం’ కథ
