ఆంజనేయుడికి గుడి కడదామని పునాదులు తవ్వుతుండగా అద్భుతం వీడియో
మధ్యప్రదేశ్ లోని మోరిన జిల్లాలో గురువారం ఒక అరుదైన ఘటన వెలుగు చూసింది. గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు సంకల్పించారు. ఇందుకోసం అందరూ చందాలు వేసుకున్నారు. టెంపుల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనుల కోసం పునాదులు తవ్వుతుండగా ఆశ్చర్యకరంగా ప్రాచీన కాలానికి చెందిన బంగారు నాణేలు బయటపడ్డాయి. సగౌరియాపురా గ్రామంలో జరుగుతున్న తవ్వకాల సమయంలో నాణేలు లభించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకొని ఆ నాణేలను ఆసక్తిగా పరిశీలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.సుమారు 50 నుండి 60 బంగారు నాణేలు బయటపడ్డాయని గ్రామ సర్పంచ్ సంతోషీలాల్ ఠాకూర్ తెలిపారు. అయితే పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రాజేంద్ర పరిహార్ మాత్రం ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25 నాణేలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎంత మందికి నాణేలు లభించాయి? ఆ ప్రాంతంలో ఇంకా నాణేలు పాతిపెట్టి ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ నాణేల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. అవి నిజంగానే ప్రాచీన కాలానికి చెందినవైతే ఏ శకానికి సంబంధించినవో తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టనున్నారు. ఈ నాణేలు బయటపడిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారుల నివేదిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :