ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ పైకి.. ఐదో అంతస్తు నుంచి పడి వీడియో

Updated on: Jan 04, 2026 | 1:39 PM

బెంగళూరులోని ఫార్మా సంస్థ బయోకాన్‌ లో విషాదం చోటుచేసుకుంది. కంపెనీ భవనం ఐదో అంతస్తు నుంచి పడి 26 ఏళ్ల ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని బనశంకరి ప్రాంతానికి చెందిన ఎస్. అనంత కుమార్‌ గా పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అనంత కుమార్ గత ఆరు నెలలుగా బయోకాన్ ఫైనాన్స్ డివిజన్లో పనిచేస్తున్నాడు. అతని తండ్రి శ్రీనాథ్ ఆలయ పూజారి.

పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కుమార్ ఆఫీసులోని కేఫటేరియా టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే యువకుడు ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన కుమార్‌ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు తనిఖీ చేయగా ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అయితే అనంత కుమార్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అని అగ్రహార పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా ఎవరితో ఫోన్ మాట్లాడాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫోన్ కాల్ డేటా సేకరిస్తున్నారు. ఘటనపై బయోకాన్ సంస్థ సీఈవో కిరణ్‌ మాజుందార్‌ షా వ్యక్తం చేసారు. తమ ఉద్యోగి మరణం తీవ్రంగా కలచివేసిందనీ ఈ సమయంలో బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపారు.