మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్‌ బేబీస్‌”

Updated on: Jun 19, 2026 | 5:27 PM

మానవ పిండాల డీఎన్‌ఏను అత్యంత కచ్చితత్వంతో ఎడిట్ చేయడంలో కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. ‘బేస్ ఎడిటింగ్’ సాంకేతికతతో గుండెజబ్బులు, వంశపారంపర్య వ్యాధులను నివారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో కోరుకున్న లక్షణాలతో పిల్లలను సృష్టించే ప్రమాదంపై నైతిక ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సాంకేతికత ఇంకా క్లినికల్ వినియోగానికి సిద్ధంగా లేదని పరిశోధకులు స్పష్టం చేశారు.

కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కచ్చితత్వంతో తొలిదశ మానవ పిండాల డీఎన్‌ఏను విజయవంతంగా ఎడిట్‌ చేశారు. ఈ మైలురాయి భవిష్యత్తులో వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గుండెజబ్బులను నివారించడానికి సహాయపడవచ్చు. కానీ ఇది తమకు నచ్చిన లక్షణాలతో కూడిన పిల్లలను సృష్టించే అవకాశం పై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. ఈ పరిశోధనకు జన్యు శాస్త్రవేత్త డైటర్‌ ఎగ్లీ నాయకత్వం వహించారు. మానవ పిండాల డీఎన్‌ఏను మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ప్రజల్లో చర్చను ఈ ఫలితాలు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. తాము శాస్త్రీయ డేటాను మాత్రమే అందించగలమనీ ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించాలో సమాజమే నిర్ణయించాలని అన్నారు. డీఎన్‌ఏ ఎడిటింగ్‌ లేదా మార్పు కోసం పరిశోధకులు బేస్‌ ఎడిటింగ్‌ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించారు. సాంప్రదాయ క్రిస్పర్‌ జీన్‌ ఎడిటింగ్‌లా కాకుండా బేస్‌ ఎడిటింగ్‌ అనేది వ్యక్తిగత జన్యు అక్షరాలలో కచ్చితమైన మార్పులను చేస్తుంది. గత జీన్‌ ఎడిటింగ్‌ పద్ధతుల్లో తరచుగా కనిపించే భారీ డీఎన్‌ఏ నష్టాన్ని ఈ పద్ధతి నివారించిందని పరిశోధక బృందం తెలిపింది. దుష్ప్రభావాలకు సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉందని డాక్టర్‌ ఎగ్లీ నొక్కి చెప్పారు. ఈ సాంకేతికత ఇంకా క్లినికల్‌ వినియోగానికి సిద్ధంగా లేదని అన్నారు. గత సంవత్సరం, ప్రాణాంతక జన్యు లోపంతో ఉన్న ఒక శిశువుకు నయం చేయడానికి వైద్యులు ప్రత్యేకంగా తయారు చేసిన బేస్‌ ఎడిటింగ్‌ అణువులను ఉపయోగించారు. డాక్టర్‌ ఎగ్లీ బృందం ఈ సాంకేతికతను మానవ పిండాలపై పరీక్షించాలని నిర్ణయించుకుంది. శాస్త్రవేత్తలు రెండు జన్యువులపై దృష్టి పెట్టారు. ఒక జన్యువు పీసీఎస్‌కే9, ఇది ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. రెండవ జన్యువు హెచ్‌బీజీ. ఇది పిండంలో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో పాత్ర పోషిస్తుంది. దానం చేసిన ఫలదీకరణ గుడ్లు, రెండు కణాల పిండాలను ఉపయోగించి పరిశోధకులు బేస్‌ ఎడిటింగ్‌ అణువులను ప్రవేశపెట్టి రెండు జన్యువులను విజయవంతంగా మార్చారు. కొన్ని పిండాలలో వారు ఒకే సమయంలో రెండు జన్యువులను ఎడిట్‌ చేయగలిగారు. మునుపటి క్రిస్పర్‌ ప్రయోగాలలా కాకుండా పరిశోధకులు ఎటువంటి పెద్ద డీఎన్‌ఏ నష్టాన్ని గమనించలేదు. మానవ పిండాలను ఎడిట్‌ చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధులను నివారించడం కంటే లక్షణాలను మెరుగుపరుచుకోవడానికి చూసే వ్యక్తులు ఈ పరిశోధనను ఉపయోగించుకొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకేసారి ఎక్కువ జన్యువులను ఎడిట్‌ చేయడానికి ప్రయత్నిస్తే వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. వాడకానికి ముందు నైతికతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!

130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న నర్స్ మాటలు !

భారీ ట్రాక్టర్‌ను తన రెక్కలతో ఆపేసిన పక్షి..! గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ

ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!

Follow Us