చంద్రబాబు అరెస్ట్‌పై లోక్‌సభలో వైసీపీ, టీడీపీ ఎంపీల వాగ్వాదం

Updated on: Sep 18, 2023 | 6:11 PM

చంద్రబాబు అరెస్ట్‌పై లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్‌ చేశారని అన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు టీడీపీ ఎంపీలు. అయితే గల్లా జయదేవ్‌ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. చంద్రబాబు హయాంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం జరిగిందన్నారు. అన్ని ఆధారాల తోనే ఆయన్ను అరెస్ట్‌ చేశారని అన్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం అని.. ఆయన్ను జైల్లో పెట్టడాన్ని ఖండిస్తూ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’, ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి నారా లోకేశ్‌ హాజరయ్యారు. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకొని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాలని టీడీపీ నేతలు కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

 

Loading...
Unable to load recommendations.
Follow Us