1500 మందిని కాపాడి.. అగ్నికీలలకు ఆహుతైన పైలెట్

Updated on: Sep 25, 2025 | 4:14 PM

దేశ సేవలో మిగ్‌-21 యుద్ధ విమానాలకు ఉండే ప్రత్యేకతే వేరు. ఇండో-పాక్‌ యుద్దంతో పాటు కార్గిల్‌ వార్‌లో కీలక పాత్ర పోషించాయి. వైమానిక దళంలో 62 ఏళ్ల పాటు సేవలు అందిస్తూ వచ్చిన మిగ్‌-21 యుద్ద విమానాలను ఈ నెల 26న దేశ రక్షణ విధుల నుంచి పూర్తిగా ఉపసంహరించనున్నారు. ఆ ఫైటర్‌జెట్‌తో ఎందరో పైలట్ల త్యాగాలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.

అలాంటి సాహసికుల్లో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ మన్ను అఖౌరి అసమాన త్యాగం దేశవ్యాప్తంగా మరోమారు చర్చలో నిలిచింది. ఒక గ్రామాన్ని, 1,500 మంది విద్యార్థులను కాపాడటం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరుడు మన్ను అఖౌరి. ఝార్ఖండ్‌కు చెందిన పలాము జిల్లా మేదినీనగర్‌లో మన్ను అఖౌరి 1984 జనవరి 21న జన్మించారు. చిన్నతనం నుంచే భారత వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. పఠాన్‌కోట్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించి 2006 జూన్‌ 17న ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ అయ్యారు. 2009 సెప్టెంబరులో పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ యుద్ధ విన్యాసాల్లో మన్ను పాల్గొన్నారు. అయితే మన్ను అఖౌరి నడుపుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానం భలైయాణా గ్రామ గగనతలంలో ఉంది. ఆ గ్రామ ప్రజలకు ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో విమానాన్ని పక్కకు మళ్లించారు. ఆ తర్వాత విమానాన్ని ఓ పాఠశాలపై కిందకు దించాలని భావించినా… సుమారు 1,500 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్లు గ్రహించి ముక్త్‌సర్‌-భటిండా రహదారి పక్కనున్న పొలం వైపు మళ్లించారు. మంటలు అప్పటికే విమానమంతటికీ విస్తరించాయి. బయటకు వచ్చే అవకాశం లేక ప్రమాదానికి గురై మరణించారు. గ్రామ ప్రజలను, విద్యార్థులను కాపాడటం కోసం మన్ను తన ప్రాణాలను త్యాగం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున

Top9 ET News: కృతజ్ఙత లేని వ్యక్తి! హీరోపై బండ్ల షాకింగ్ ట్వీట్