ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ

Updated on: Mar 25, 2026 | 5:01 PM

దురంధర్ సినిమా 'బ్లాక్ టైగర్' రవీంద్ర కౌశిక్ అసలు కథను వివరిస్తుంది. ఈ భారతీయ గూఢచారి పాకిస్థాన్ సైన్యంలో చేరి కీలక సమాచారం అందించారు. దేశ రక్షణకు ఆయన చేసిన త్యాగాలను, ఎదుర్కొన్న చిత్రహింసలను ఈ కథ స్పృశిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన రవీంద్ర కౌశిక్ లాంటి నిశ్శబ్ద సైనికులకు సరైన గుర్తింపు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

దురంధర్‌ సినిమా కథ ఏంటో ఓసారి చూద్దాం. 1999లో ఐసీ-814 విమాన హైజాక్, 2001 భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఓ ముఖ్య నిర్ణయం తీసుకుంటాడు. పాకిస్థాన్‌ను చావు దెబ్బ కొట్టడానికి ఆపరేషన్‌ ధురంధర్‌ పేరుతో ఓ రహస్య మిషన్‌ చేపడతాడు. ఆ మిషన్‌లో భాగంగా పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్‌‌గా ‘హమ్జా’ అనే మారుపేరుతో పాక్‌లోకి పంపుతాడు. రహస్య ఏజెంట్‌గా పాక్‌లో అతడి ప్రయాణం ఎలా సాగింది? ఎదురైన సవాళ్లేంటి? కరాచీలో రెహమాన్‌ బలోచ్‌ని ఎలా అంతం చేశాడు? అన్నదే టూకీగా దురంధర్‌ సినిమా కథ. మరి ఆ సినిమా కథకు మూలం ‘బ్లాక్ టైగర్’ రవీంద్ర కౌశిక్. భారత గూఢచార చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 1952లో రాజస్థాన్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్ రంగస్థల నటుడిగా జీవితం ప్రారంభించి, తన 23 ఏళ్ల వయసులోనే భారత గూఢచార సంస్థ ‘రా’ దృష్టిని ఆకర్షించారు. దేశం పిలుపు మేరకు అత్యంత ప్రమాదకరమైన బాధ్యతను స్వీకరించారు. పాకిస్థాన్‌లో గూఢచర్యం కోసం ఇస్లాం, ఉర్దూ భాషలపై పట్టు సాధించి ‘నబీ అహ్మద్ షాకిర్’ అనే మారుపేరుతో పాక్‌లో అడుగుపెట్టారు. అక్కడే లా డిగ్రీ పూర్తి చేసి, ఏకంగా పాకిస్థాన్ సైన్యంలోనే చేరారు. తన ప్రతిభతో మేజర్ స్థాయికి ఎదిగి, శత్రుదేశపు సైన్యంలో ఉంటూనే భారత దేశానికి కీలక సమాచారం అందించారు.1979 నుంచి 1983 మధ్య కాలంలో కౌశిక్ పంపిన సమాచారం వేలాది మంది భారత సైనికుల ప్రాణాలను కాపాడిందని చెబుతారు. ఆయన ధైర్యసాహసాలకు ముగ్ధురాలైన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర్’ అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. అయితే, మరో ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఆచూకీ బయటపడింది. పాక్ సైన్యానికి చిక్కిన తర్వాత దశాబ్దాల పాటు చిత్రహింసలు అనుభవించినా, దేశ రహస్యాలను మాత్రం బయటపెట్టలేదు. చివరకు 2001 మార్చి 23న ముల్తాన్ జైలులో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా, కౌశిక్ లాంటి నిశ్శబ్ద సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈ అసమాన దేశభక్తుడి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ

Published on: Mar 25, 2026 04:59 PM
Follow Us