UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?

Updated on: Sep 19, 2026 | 4:49 PM

అక్టోబర్‌ 15 నుంచి యూపీఐలో కొత్త ఎండీఆర్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ.2,000 దాటిన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తించనుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే పేమెంట్లు, రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులు ఉచితంగానే ఉంటాయి. ఈ ఎండీఆర్‌ను వినియోగదారులపై నేరుగా విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నెట్‌వర్క్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు వ్యాపారులకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న యూపీఐ సేవల్లో కొత్త నిబంధనలు రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి కొన్ని నిర్దిష్ట లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త నిబంధనలు సామాన్య ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోజువారీ వ్యక్తిగత బదిలీలపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవు. ఇవి పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి. అలాగే, మొత్తం లావాదేవీలలో 95 శాతానికి పైగా ఉన్న రూ. 2,000 లోపు చిన్న మొత్తాల లావాదేవీలపై కూడా ఎటువంటి ఛార్జీలు వర్తించవు. కేవలం రూ. 2,000 దాటిన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే లావాదేవీలపై మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. రూ. 2,000 దాటిన ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకు స్థిరంగా రూ. 5 ఫ్లాట్ MDR విధించబడుతుంది. సిప్ (SIP), మ్యూచువల్ ఫండ్స్‌, స్టాక్‌బ్రోకింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై 0.02% MDR వర్తించనుంది. దీని గరిష్ట పరిమితిని రూ. 300గా నిర్ణయించారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియోహాట్‌స్టార్ వంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లు, మొబైల్, కరెంట్‌ బిల్లుల వంటి UPI ఆటోపే పునరావృత చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. ఈ MDR ఛార్జీలను నేరుగా వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం ఉండదని, ఇది వ్యాపారులు మరియు బ్యాంకుల మధ్య జరిగే ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లిస్తారా లేదా అనేది మునుముందు తేలనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐలో ఈ మార్పులు డిజిటల్ ఆర్థిక రంగంలో కొత్త చర్చకు దారితీశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nirmala Seetharaman: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌

రూ.10 లక్షల లంచం + రోజూ బిర్యానీ = ఏసీబీ షాక్!

నొప్పి తగ్గించే ఇంజెక్షన్, కిక్కిచ్చే మత్తుమందుగా మారిందా ?

Loading...
Unable to load recommendations.
Follow Us