భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!

Updated on: Jun 25, 2026 | 4:15 PM

ఆ కుటుంబంలో వరుస విషాదాలు నిండాయి. కారు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మృతదేహాలను ఇంటికి తీసుకువచ్చినపుడు ఇంటి యజమాని మూఢనమ్మకాలతో తాళం వేశాడు. మానవత్వాన్ని మరిచి ప్రవర్తించిన ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. స్థానికుల బ్రతిమిలాడినా, పోలీసుల హెచ్చరించినా యజమాని మనసు కరగకపోవడంతో మృతదేహాలకు పురుషోత్తమపట్నంలో అంత్యక్రియలు నిర్వహించారు.

భద్రాచలంలో మూఢనమ్మకాలతో కూడిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కారు ప్రమాదంలో మరణించగా, వారి మృతదేహాలను అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. వరుస విషాదాలు సంభవించిన ఆ కుటుంబానికి చెందిన దూడల శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆ శోకం నుంచి తేరుకోకముందే, జూన్ 21న ములకలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు సాయి ప్రకాష్, కోడలు సంధ్య, మనవడు మోక్షిత్ దుర్మరణం పాలయ్యారు. పోస్ట్‌మార్టం అనంతరం, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహాలను వెంకటేశ్వర కాలనీలోని అద్దె ఇంటికి తీసుకువచ్చారు. అయితే, ఇంటి యజమాని సాంబశివరావు, వరుస మరణాల వల్ల కీడు జరుగుతుందని నమ్మి, మృతదేహాలను లోపలికి రానివ్వకుండా గేటుకు తాళం వేశాడు. స్థానికులు, బంధువులు ఎంతగా బ్రతిమిలాడినా, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా అతని మనసు మారలేదు. చివరికి, మృతురాలు సంధ్య స్వగ్రామమైన పురుషోత్తమపట్నం గ్రామానికి ఆ మూడు మృతదేహాలను తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఘటనపై సీపీఎం నాయకుడు బాల నరసారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us