Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

Updated on: Aug 26, 2025 | 3:32 PM

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ శాఖ ప్రకారం, మంగళవారం మరియు బుధవారం తెలంగాణలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు వృత్తాకార పవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో మంగళవారం తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బుధవారం తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్,యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఏపీలోనూ మంగళ, బుధవారాల్లో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం నుంచి ఎడతెగని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైతుబజార్ పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలుసుపూరం జంక్షన్, ఫారెస్ట్ ఆఫీస్, బొందిలిపురం రోడ్లలో మోకాళ్ల లోతులో రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Published on: Aug 26, 2025 03:32 PM
Follow Us