ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గ్యాస్ సబ్సిడీ కోసం నో వెయిటింగ్!

Updated on: Sep 20, 2026 | 5:03 PM

ఏపీలో దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారులు ముందుగా సిలిండర్‌ ధర చెల్లించి, తర్వాత సబ్సిడీని బ్యాంక్‌ ఖాతాలో పొందుతున్నారు. ఈ మొత్తం ఎప్పుడు జమ అవుతుందో తెలియక ఎదురుచూడాల్సి వస్తోంది. ఇకపై నెలవారీగా ముందుగానే నిర్ణయించిన తేదీలో సబ్సిడీ జమ చేసే విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దీపం-2’ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ పథకంలో ఇప్పటివరకు ఉన్న చిన్న చిన్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి, డబ్బులు చెల్లించిన తర్వాత.. ఆ రాయితీ డబ్బులు మన అకౌంట్లో ఎప్పుడు పడతాయో తెలియక చాలామంది లబ్దిదారులు పడుతున్న టెన్షన్‌కు త్వరలోనే తెరపడనుంది. ఇకపై రోజుల తరబడి ఎదురుచూసే పనిలేకుండా పక్కా షెడ్యూల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీపం-2 పథకం కింద రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలంరికీ ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. అయితే, ముందుగా లబ్దిదారుడే సిలిండర్ డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ, ఈ డబ్బులు ఏ రోజు అకౌంట్లో జమ అవుతాయనేదానిపై ఇప్పటివరకు ఒక స్పష్టమైన తేదీ అనేది లేదు. ఈంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసేవారు. అంతేకాకుండా, కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అంకౌట్లు ఉండటంతో సబ్సిడీ ఏ అకౌంట్లో పడిందో తెలియక గందరగోళం ఏర్పడేది. ఈ సమస్యలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన పౌరసరఫరాల శాఖ అధికారులు.. దీనికి ఒక చక్కటి పరిష్కారాన్ని అన్వేషించారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ లాంటి ఇతర సంక్షేమ పథకాల్లో అనుసరిస్తున్న విధానాన్నే ఇప్పుడు దీపం-2 పథకానికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం, ఇకపై ప్రతి నెలా గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఏ తేదీన జమ అవుతాయనేది ప్రభుత్వం ముందుగానే ఒక ఫిక్స్డ్ డేట్ ప్రకటిస్తుంది. ఉదాహరణకు, మీరు సెప్టెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ తీసుకుంటే, అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన నిర్దిష్ట తేదీన మీ అకౌంట్లో నేరుగా డబ్బులు జమవుతాయి. దీంతో లబ్దిదారులు ఎటువంటి టెన్షన్ పడకుండా, ఆ నిర్దిష్ట తేదీ రాగానే తమ అకౌంట్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పథకం కింద కూటమి సర్కార్‌ ఏడాదికి మూడు సిలిండర్లను సరిగ్గా ప్లాన్ చేసి ఇస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ నుంచి జులై వరకు మొదటిది, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు రెండోది, అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో సిలిండర్‌ను లబ్దిదారులు పొందవచ్చు. 2024 అక్టోబర్ 31న అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే కోట్లాది మంది పేద మహిళలకు లబ్ది చేకూరుతోంది. ఇప్పుడు ఈ కొత్త ఫిక్స్డ్ పేమెంట్ డేట్ విధానం అమల్లోకి వస్తే, లబ్దిదారులకు మరింత స్పష్టత వస్తుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్యాస్ లబ్దిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక..రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్

బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?

Loading...
Unable to load recommendations.
Follow Us