Telangana: అనుమానం పెను భూతమైంది.. కట్టుకున్న భార్యను చంపి భర్త ఆత్మహత్య
అనుమానం పెను భూతమైంది. ఏకంగా తాళి కట్టిన భార్యను గొంతు కోసిన అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. ఆపై తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లో చోటుచేసుకుంది.
![Telangana: అనుమానం పెను భూతమైంది.. కట్టుకున్న భార్యను చంపి భర్త ఆత్మహత్య](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/crime.jpg?w=1280)
అనుమానం పెను భూతమైంది. ఏకంగా తాళి కట్టిన భార్యను గొంతు కోసిన అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. ఆపై తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లో చోటుచేసుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 18న ముడుమాల్ ప్రాంతానికి చెందిన తంగడి తిమ్మప్ప(26)కు కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా బాడ్యాలకు చెందిన సంధ్య(21)తో వివాహం జరిపించారు పెద్దలు. భార్య తీరుపై కొద్దిరోజులుగా తిమ్మప్పకు అనుమానం తలెత్తింది. దీంతో ఆ దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య బుధవారం(ఆగస్ట్ 14) మరోసారి గొడవ మొదలైంది. దీంతో ఆవేశానికి గురైన తిమ్మప్ప కత్తితో భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం అయిన సంధ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఈ హఠాత్తు పరిణామంతో అక్కడే తిమ్మప్ప సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన సంధ్య అతికష్టంపై ఇంటి తలుపు గడియ తీసి బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న సంధ్యను వెంటనే కర్ణాటకలోని రాయచూరు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ప్యాన్కు వేలాడుతూ తిమ్మప్ప శవం కనిపించింది. సంధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎస్ఎం నవీద్ చెప్పారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..