
ఉపాధి హామీ పనులు ముగించుకుని ప్రశాంతంగా ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న కూలీలకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ప్రయాణిస్తున్న ఆటోలోకి ఒక్కసారిగా పాము దూసుకొచ్చడంతో కూలీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ముగ్గురు కూలీలు రన్నింగ్ ఆటో నుంచి కిందకు దూకేయడంతో గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామానికి చెందిన 15 మంది కూలీలు రోజువారీ ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగిసిన అనంతరం అందరూ కలిసి ఒకే ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. ఆటో వేగంగా వెళ్తున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని ఓ పాము ఒక్కసారిగా ఆటోలోకి ప్రవేశించింది. అకస్మాత్తుగా పామును గమనించిన కూలీలు భయంతో హడలిపోయారు. అది ఎవరినైనా కాటు వేస్తుందేమోనన్న ఆందోళనతో అరుపులు, కేకలు వేస్తూ ఆందోళనకు గురయ్యారు.
డ్రైవర్ ఆటోను ఆపేలోపే ముగ్గురు కూలీలు ప్రాణభయంతో రన్నింగ్ ఆటో నుంచి రోడ్డుపైకి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. దీంతో వారి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
పాము ఎవరినీ కరవకపోయినా, అది కలిగించిన భయమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..