Hyderabad: అమెరికాలో ఉద్యోగం, డిసెంబర్లో వివాహం.. అంతలోనే అంతులేని విషాదం
చేతికొచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధల ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగం సాధించి, ఇక వివాహం చేసుకోబోతున్న కుమారుడు మరణిస్తే ఆ బాధ మాటల్లో వర్ణించలేనిది. తాజాగా ఇలాంటి ఓ హృదయవిదార ఘటన అమెరికాలో చోటు చేసుకుంది...
![Hyderabad: అమెరికాలో ఉద్యోగం, డిసెంబర్లో వివాహం.. అంతలోనే అంతులేని విషాదం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/akshith-reddy.jpg?w=1280)
చేతికొచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధల ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగం సాధించి, ఇక వివాహం చేసుకోబోతున్న కుమారుడు మరణిస్తే ఆ బాధ మాటల్లో వర్ణించలేనిది. తాజాగా ఇలాంటి ఓ హృదయవిదార ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. హైదరాబాద్లోని కాటేదాన్కు చెందిన అక్షిత్ రెడ్డి అనే యువకుడు అమెరికాలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ నెల 21వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు 25 ఏళ్ల క్రింత కాటేదాన్ వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు (అక్షిత్ రెడ్డి) ఉన్నారు. గోపాల్ రెడ్డి డీసీఎం డ్రైవర్గా జీవనం సాగిస్తూ పిల్లలను పెంచాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి. అక్షిత్ రెడ్డిని ఉన్న చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా పంపించాడు. చికాగోలోని ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేసిన అక్షిత్ రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
అక్షిత్ రెడ్డికి వివాహం చేయాలన్న ఆలోచనతో ఉన్న పేరెంట్స్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. డిసెంబర్లో ఇండియాకు వస్తే అక్షిత్కు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అంతలోనే అక్షిత్ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. గత శనివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్మిశిగన్లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలోనే చెరువు మధ్యలోని ఓ రాయి వద్దకు వెళ్లి రావాలని డిసైడ్ అయ్యారు. వీరిలో ఒకరు రాయి వరకు చేరుకోగా అక్షిత్ రెడ్డి మాత్రం మధ్యలోనే అలసిపోయాడు. దీంతో వెనక్కి తిరిగి వచ్చాడు. అయితే మధ్యలోనే మునిగిపోయాడు. మరో వ్యక్తి కూడా మునిగిపోగా స్థానికులు రక్షించారు.
రంగంలోకి దిగిన పోలీసులు అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. వారం రోజుల తర్వాత శనివారం (జులై 27)న అక్షిత్ రెడ్డి మృతదేహం కాటేదాన్కు చేరుకోగా, ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు. రెండు నెలల్లో కుమారుడు వస్తే పెళ్లి చేద్దామని ఆశతో ఎదురు చూస్తున్న అక్షిత్ తల్లిదండ్రులు కొడుకు చావు వార్త వినగానే గుండెలు పగిలేలా రోదించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాధాన్ని నింపింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..