
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఒక దారుణ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను ఓ భర్త గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ చారి (44), అతని భార్య (38) గత కొంతకాలంగా నివసిస్తున్నారు. అయితే, భార్య ప్రవర్తనపై సంతోష్ కుమార్ చారి కొద్దిరోజులుగా అక్రమ సంబంధం నెరపుతోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే జూన్ 5 (శుక్రవారం) తెల్లవారుజామున భార్య గాఢనిద్రలో ఉండగా, సంతోష్ కుమార్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లోనే ఉన్న గొడ్డలిని తీసుకుని నిద్రిస్తున్న ఆమె తలపై బలంగా మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
శనివారం ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడైన భర్త సంతోష్ కుమార్ చారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్షణికావేశం, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా విషాదం నింపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..