Telangana: కొడంగల్లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థాపన
కరవు పీడిత కొడంగల్-నారాయణపేట-మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ పథకం సాధనకు ఎంతగానో ప్రయత్నించారు. ఆయన పోరాటంతో 2014లోనే ఈ పథకం అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ జీవో జారీ చేశారు.
![Telangana: కొడంగల్లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థాపన](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/telangana-cm-revanth-reddy.jpg?w=1280)
హైదరాబాద్ ఫిబ్రవరి 20: కరవు పీడిత కొడంగల్-నారాయణపేట-మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ పథకం సాధనకు ఎంతగానో ప్రయత్నించారు. ఆయన పోరాటంతో 2014లోనే ఈ పథకం అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ జీవో జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లిస్తామని ప్రకటించి ఆ జీవోను అటకెక్కించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ పథకం పట్టాలెక్కింది. తాము అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పనులు చేపడతామని ప్రతిపక్ష నేతగా ఉండగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ పథకానికి రూ.2945.50 కోట్లతో పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనితోపాటు ఆర్ అండ్ బీ, విద్యా, వైద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పంచాయతీరాజ్, విద్యుత్, పట్టణాభివృద్ధి, పశుగణాభివృద్ధి శాఖల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.
అందుబాటులోకి వైద్యం..
కొడంగల్లో రూ.124.50 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల రూ.46 కోట్లు, ప్రభుత్వ ఫిజియోథెరపి కళాశాల (రూ.27 కోట్లు), కొడంగల్లోని సామూహిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.27 కోట్లతో 220 పడకల సామర్థ్యంగల బోధన ఆసుపత్రిగా మార్చే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వీటి నిర్మాణంతో కొడంగల్, నారాయణపేట్తో సమీప నియోజకవర్గాల్లోని లక్షలాది మంది ప్రజలకు వైద్య సేవలు చేరువకానున్నాయి. రూ.360 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వెటర్నరీ కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.45 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, కొడంగల్లో రూ.6.8 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, రూ.344 కోట్లతో వికారాబాద్ జిల్లాలో సింగిల్ లేన్ రోడ్లుగా ఉన్న రహదారులను డబుల్ లేన్ రోడ్లుగా, డబుల్ లేన్ రోడ్ల అభివృద్ధి, పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రూ.25 కోట్లతో కొడంగల్ టీఎంఆర్ స్కూల్కు శాశ్వత భవనాల నిర్మాణం, రూ.27.886 కోట్లతో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని తండాలు, గిరిజన ప్రాంతాలను అనుసంధానించే రహదారుల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.5 కోట్లతో కొడంగల్ హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం పనులకు, రూ.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు, దౌల్తాబాద్, బొంరాస్పేట్లో రూ.7.13 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
వీటితో పాటు దౌల్తాబాద్ మండలం నీటూరులో రూ.25 కోట్లతో చేపట్టనున్న ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ స్కూల్/జూనియర్ కళాశాల భవనాలకు, కోస్గిలో రూ.30 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనాల పనులకు, కోస్గిలో రూ.11 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనాలకు, మద్దూర్లో రూ.20 కోట్లతో నిర్మించనున్న నూతన టీఎస్డబ్ల్యూఆర్ ఎస్జేసీ, కొడంగల్లో రూ.25 కోట్లతో నిర్మించనున్న నూతన టీఎస్డబ్ల్యూఆర్ ఎస్జేసీ భవనాల పనులకు, కొడంగల్ నియోజకవర్గ పరిధిలో రూ.213.20 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జిలు, అప్రోచ్ రోడ్ల పనులకు, రూ.3.99 కోట్లతో దుద్యాల మండలం హస్నాబాద్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.3 కోట్లతో కోస్గిలో నిర్మించిన ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..