ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మాములు విషయం కాదన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమితో కాకుండా పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు.
వైఎస్ జగన్ను ఓడించేందుకు వైఎస్ షర్మిలను వస్తువులా వాడుకున్నారన్నారు. అంతకు మించి షర్మిల ఏమీ లేదని చెప్పారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేనన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారం, ఆత్మ విశ్వాసం తేడా తెలియక, అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అన్న కేటీఆర్, తమ వైఖరి మార్చుకోవాల్సి ఉందన్నారు. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం, అభివృద్ధిని మేము జనానికి చెప్పుకోలేకపోయామన్నారు. తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదనన్నారు.
మరోవైపు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ హీటెక్కిస్తోంది. బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్న గులాబీపార్టీ నేతలు హస్తినలో రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించారు. ఎన్నికల కమిషన్తోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దేశంలో పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..