KTR vs Bandi Sanjay : కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్, తెలంగాణలో టీఆర్ఎస్ – బీజేపీ మధ్య పెరుగుతోన్న పొలిటికల్ హీట్
KTR vs Bandi sanjay : మొన్న వరద సాయంపై పంచాయితీ. నిన్న కొలువుల కొట్లాట. ఇవాళ ITIRపై రగడ. మీరు వెలగబెట్టింది ఏంటీ? అంటే.. మీరేం వెలగబెట్టారు అంటూ మాటల దాడికి దిగుతున్నాయి. ఇటు టీఆర్ఎస్..
KTR vs Bandi sanjay : మొన్న వరద సాయంపై పంచాయితీ. నిన్న కొలువుల కొట్లాట. ఇవాళ ITIRపై రగడ. మీరు వెలగబెట్టింది ఏంటీ? అంటే.. మీరేం వెలగబెట్టారు అంటూ మాటల దాడికి దిగుతున్నాయి. ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ. ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే.. మరొకటి తెలంగాణలో అధికార పార్టీ. నిన్నటి వరకు సాగిన.. కొలువుల కొట్లాట ఇప్పుడు ITIR పార్క్ వైపు మళ్లింది. ITIR కోసం డీపీఆర్లు ఇస్తాం.. కేంద్రాన్ని ఒప్పిస్తారా? ప్రాజెక్ట్ తెస్తారా? అంటూ బంతిని బీజేపీ కోర్టులోకి విసిరారు ఐటీ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్కు ఐటీఐఆర్ తీసుకురాలేని బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారాయన. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ను మూలన పెట్టింది బీజేపీ ప్రభుత్వమే అంటూ విరుచుకుపడ్డారు. 2014 నుంచి రాసిన లేఖలు, డీపీఆర్లు బండి సంజయ్కు ఇస్తాం ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్కు ఉందా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. మరిప్పుడు.. బీజేపీ ఏం చేయబోతుంది? ఆ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాబోతుందన్నదే కీలకంగా మారింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ – ITIR. హైదరాబాద్ స్థాయిని నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్తుందని ఆశపడ్డ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఇప్పటిదాకా అతీగతీ లేదు. ఏళ్లపాటు ఊరించి.. చివరికి తూచ్ అనేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఐటీఐఆర్కి సమానమైన ప్రాజెక్ట్ మంజూరు చేయాలని గతంలో కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అయినా ఎలాంటి ఎలాంటి పురోగతి లేదంటోంది టీఆర్ఎస్. MLC ఎన్నికల సమయంలో నిరుద్యోగుల దృష్టి మళ్లించేందుకే.. టీఆర్ఎస్ ఐటీఐఆర్ ఇష్యూని తెరపైకి తెచ్చిందంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సింది చేయకుండా…ఇప్పుడు కేంద్రంపై నిందలు మోపడమేంటని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి టీఆర్ఎస్ వైఫల్యం కారణమైతే.. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఏమైందని ప్రశ్నిస్తోంది టీఆర్ఎస్. బెంగళూరు ఐటీఐఆర్ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తియ్యలేదని గుర్తుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐటిఐఆర్ ప్రాజెక్ట్ అటకెక్కడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి తీరును తప్పుబడుతోంది కాంగ్రెస్. లేఖలతో మొదలైన రచ్చ క్షమాపణల కోసం డిమాండ్ చేసే వరకు వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ రియాక్షన్ ఏంటన్నది క్యూరియాసిటీ పెంచుతోంది.