Buffalo Distribution Scheme: తెలంగాణలో మళ్లీ బర్రెల పంపిణీ… సబ్సిడీపై అందజేత… ఎప్పటిలోగా అంటే..?
తెలంగాణ పశుసంవర్ధక శాఖ పాడి రైతులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్ సంస్థ ద్వారా సబ్సిడీపై 10వేల...
తెలంగాణ పశుసంవర్ధక శాఖ పాడి రైతులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్ సంస్థ ద్వారా సబ్సిడీపై 10వేల బర్రెలు అందించనున్నది. వచ్చే వేసవిలో పాలకొరతను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న పాలదిగుబడిని పెంచేందుకు అదనంగా రైతులు బర్రెలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. హైదరాబాద్లో రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగిన విజయడెయిరీ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
విజయ డెయిరీ ద్వారా దాణా …
విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు బ్యాంక్ లింకేజీ ద్వారా బర్రెల కొనుగోలుకు సబ్సిడీ అందజేయాలని తీర్మానించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా కొనుగోలు చేసిన రైతు ఏడాదిపాటు విజయడెయిరీకి పాలు విక్రయించాల్సి ఉంటుంది. విజయడెయిరీకి పాలుపోసే రైతులంతా బర్రెలకు బీమా పాలసీ వర్తింపచేయాలని తీర్మానించింది. పశువులకు దాణాకు ప్రస్తుతం అందిస్తున్న రూ.100 సబ్సిడీని రూ.250కి పెంచడంతోపాటు అవసరమైన దాణాను విజయడెయిరీ ద్వారా అందించాలని సూచించింది. కరోనా సమయంలో విజయవంతంగా సేవలు అందించిన అధికారులు, ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. సమావేశంలో పశుసంర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, డైరెక్టర్ డాక్టర్ వీ లక్ష్మారెడ్డి, ఎండీ శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Tractor Rally Violence: రైతు ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసంపై పిటిషన్లు… సుప్రీంకోర్టులో విచారణ…