Lionel Messi India Tour : 14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో మెస్సీకి హైదరాబాద్ ట్రీట్

Lionel Messi India Tour : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ 14 సంవత్సరాల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చారు. 2011లో కోల్‌కతాలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత మెస్సీ మన దేశానికి రావడం ఇది రెండోసారి. GOAT ఇండియా టూర్ పేరుతో మూడు రోజుల పాటు ఆయన భారతదేశంలో గడపనున్నారు.

Lionel Messi India Tour : 14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో మెస్సీకి హైదరాబాద్ ట్రీట్
Lionel Messi

Updated on: Dec 13, 2025 | 7:19 AM

Lionel Messi India Tour : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ 14 సంవత్సరాల తర్వాత తిరిగి భారత్‌కు వచ్చారు. 2011లో కోల్‌కతాలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత మెస్సీ మన దేశానికి రావడం ఇది రెండోసారి. GOAT ఇండియా టూర్ పేరుతో మూడు రోజుల పాటు ఆయన భారతదేశంలో గడపనున్నారు. ఈ పర్యటనలో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడం, ఛారిటీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

మెస్సీ టూర్ ముఖ్య కార్యక్రమాలు

కోల్‌కతా (శనివారం): ఈరోజు ఉదయం సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నటుడు షారుక్ ఖాన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులను కలుస్తారు. అలాగే శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

హైదరాబాద్ (శనివారం సాయంత్రం): ఈ సాయంత్రం మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో 7v7 ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఆయన గౌరవార్థం సంగీత కచేరీ, ప్రీమియం మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఫోటో సెషన్ ఉంది. ఒక్కో ఫోటో కోసం రూ.10 లక్షలు ఛార్జ్ చేస్తారు.

ముంబై (ఆదివారం): ముంబైలో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, ఎం.ఎస్. ధోనీ, శుభ్‌మన్ గిల్ వంటి క్రికెటర్లు, నటి కరీనా కపూర్, నటుడు జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో సమావేశమవుతారు.

ఢిల్లీ (సోమవారం): పర్యటన చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మెస్సీ భేటీ అవుతారు.

హైదరాబాద్‌లో రాప్ సింగర్ కేడన్ శర్మ ప్రదర్శన

మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని అద్భుతంగా అలంకరించారు. మ్యాచ్‌కి ముందు ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకు గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో భాగంగా వినోద కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ హైదరాబాద్ రాప్ సింగర్ కేడన్ శర్మ పాల్గొంటారు. పాటలు, డ్యాన్స్‌లతో హైదరాబాద్ సంస్కృతి, బిర్యానీ, ఇరానీ చాయ్ గొప్పదనాన్ని వివరిస్తారు. తెలుగు సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా చెబుతారు.

కేడన్ శర్మ మాట్లాడుతూ.. గ్లోబల్ అథ్లెట్ ప్రోగ్రాంలో ప్రదర్శన ఇవ్వబోతున్న మొదటి భారతీయ హిప్-హాప్ ఆర్టిస్ట్‌గా రికార్డు సృష్టించడం నాకు చాలా గొప్పగా ఉంది. నేను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడిని. అందుకే నా ప్రదర్శనలు పక్కా లోకల్‌గా, స్ట్రీట్ బేస్‌డ్‌గా ఉంటాయి. నేను సాయి పల్లవి, అల్లు అర్జున్ గురించి మాట్లాడతాను, సల్మాన్ ఖాన్ గురించి కాదు. తెలుగు సినిమాలు ఇప్పుడు నేషనల్ లెవల్‌కు వెళ్లాయి. నా పర్ఫామెన్స్‌లో మెస్సీకి పుష్ప ఫేమస్ డైలాగ్ వినిపిస్తానని తెలిపారు.