
India vs Pakistan: టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసింది. ఇప్పుడు ICC తన తదుపరి టోర్నమెంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. తదుపరి ICC టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. దీనికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి లోటుపాట్లను అనుమతించదలుచుకోలేదు.

ఈ క్రమంలో పీసీబీ కరాచీ, లాహోర్, రావల్పిండిలోని తన స్టేడియంలను మరమ్మతు చేయడం ప్రారంభించింది. దీని కోసం ఐసీసీకి షెడ్యూల్ ప్రతిపాదన కూడా పంపించింది. దీని ప్రకారం ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్కు వెళ్లేలా చేసేందుకు పీసీబీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇంతలో, BCCI బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెన్షన్లో పడింది.

భారత జట్టు క్రికెట్లో అత్యున్నత స్థాయిని కలిగి ఉంది. టోర్నమెంట్లో ఎక్కడ ఆడినా డబ్బుల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఈ అవకాశాన్ని వృథా చేసుకోవాలనుకోవడంలేదు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్కు వెళ్లేలా తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

అందుకే బీసీసీఐని ఒప్పించేందుకు ఒకే వేదికలో మ్యాచ్లను ఆడించేందుకు ప్లాన్ చేసింది. ఇదిలావుండగా, టీమ్ఇండియాను పాకిస్థాన్కు పంపడం బీసీసీఐకి ఇష్టం లేదు. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇంకా ఎటువంటి చర్చలు జరగలేదని, అయితే అక్కడికి వెళ్లే ఆసక్తి లేదని BCCI వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

టీం ఇండియా పాకిస్థాన్కు వెళ్లకపోవడానికి రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలే ప్రధాన కారణం. భారత్-పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా వైరం ఉంది. భారత్లో పాక్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. అన్ని సంబంధాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆటగాళ్ల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్ల ఇప్పుడు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. 2008 నుంచి భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించలేదు. గత 16 ఏళ్లలో రెండు జట్ల మధ్య ఒకే ఒక సిరీస్ జరిగింది.