Asia Cup Trophy Controversy: ఆసియా ట్రోఫీ మాయం.. అరె నఖ్వీ నువ్వు ఇంతకన్నా దిగజారలేవు..!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించి విజయం సాధించినప్పటికీ, ట్రోఫీకి సంబంధించిన వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. భారత క్రికెట్ జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అబుదాబిలోని ఒక అజ్ఞాత ప్రదేశానికి తరలించారనే వార్త వినిపిస్తుంది.

Asia Cup Trophy Controversy:  ఆసియా ట్రోఫీ మాయం.. అరె నఖ్వీ నువ్వు ఇంతకన్నా దిగజారలేవు..!
Asia Cup Trophy Controversy

Updated on: Oct 24, 2025 | 4:37 PM

Asia Cup Trophy Controversy: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించి విజయం సాధించినప్పటికీ, ట్రోఫీకి సంబంధించిన వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. భారత క్రికెట్ జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అబుదాబిలోని ఒక అజ్ఞాత ప్రదేశానికి తరలించారనే వార్తతో మరో కీలక మలుపు తిరిగింది. ఈ ట్రోఫీ గొడవకు, రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధం ఉందని కూడా తెలుస్తోంది. అసలు ఆసియా కప్ ట్రోఫీ ఇప్పుడు ఎక్కడుంది, నఖ్వీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత భారత జట్టు ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ ట్రోఫీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెయిన్ ఆఫీసులో ఉంచారు. తాజాగా ట్రోఫీని ఏసీసీ ఆఫీసు నుంచి తరలించినట్లు తెలిసింది. బీసీసీఐ అధికారి కొద్ది రోజుల క్రితం ఏసీసీ ఆఫీసును సందర్శించి ట్రోఫీ గురించి అడగగా, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అబుదాబిలోని ఒక అజ్ఞాత ప్రదేశంలో దానిని తన ఆధీనంలో ఉంచుకున్నారని సిబ్బంది చెప్పినట్లు సమాచారం.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టోర్నమెంట్ అంతటా పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఫైనల్‌లో ట్రోఫీని కూడా పాకిస్థాన్ హోంమంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా స్వీకరించడానికి నిరాకరించింది. అయితే, ట్రోఫీని భారత జట్టుకు అందించడం తన హక్కు, బాధ్యత అని నఖ్వీ పట్టుబట్టారు. ట్రోఫీని అధికారికంగా అప్పగించమని బీసీసీఐ లేఖ పంపినా, మొహ్సిన్ నఖ్వీ మాత్రం తన పట్టు వీడలేదు.

ఏసీసీ ఆఫీసు నుంచి ట్రోఫీని కోరితే, దానిని తీసుకునేందుకు భారత ఆటగాడు తప్పనిసరిగా రావాలని, లేదా తానే ఒక అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని, అందులో పాల్గొని తీరాలని నఖ్వీ భారత అధికారులకు చెప్పినట్లు జీయో న్యూస్ నివేదించింది. సెప్టెంబర్ చివరిలో జరిగిన ఏసీసీ సమావేశం తర్వాత, ఫైనల్ తర్వాత జరిగిన గందరగోళానికి నఖ్వీ బీసీసీఐకి క్షమాపణ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, నఖ్వీ ఆ తర్వాత అలాంటి క్షమాపణ చెప్పలేదని ఖండించారు.

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కేవలం సరిహద్దుకే పరిమితం కాకుండా, క్రికెట్ మైదానంలోకి కూడా ప్రవేశించాయి. ఈ ఏడాది మొదట్లో ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణ తర్వాత, ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరిగింది. ఇది కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ టోర్నమెంట్.

టోర్నమెంట్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ భారత సాయుధ దళాలకు విజయాన్ని అంకితం చేయగా, పాకిస్తాన్ క్రికెటర్లు తుపాకీ కాల్పులు, విమానం కూలిపోవడం వంటి అనుచిత సంజ్ఞలు చేశారు. సెప్టెంబర్ 28న భారత్ గెలిచినా, ట్రోఫీని తిరస్కరించడంతో వివాదం ముగియలేదు. ఈ ఆసియా కప్ క్రికెట్ కంటే రాజకీయ, భావోద్వేగ ఉద్రిక్తతల కారణంగానే ఎక్కువగా గుర్తుండిపోతుంది.

 

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..