
బొడ్రాయి పండగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో ఎంతో ముఖ్యమైనది. ఇది గ్రామాన్ని రక్షించే ఒక పవిత్రమైన వేడుక. బొడ్రాయిని ఊరి మధ్యలో ఎందుకు ప్రతిష్టిస్తారు, ఈ పండగ ఎందుకు చేస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బొడ్రాయి పండగ ప్రధాన ఉద్దేశం గ్రామానికి, ప్రజలకు రక్షణ కల్పించడం. ఈ పండగను గ్రామదేవతను కొలవడం కోసం జరుపుకుంటారు. గ్రామ దేవత శక్తి గ్రామ ప్రజలను, వారి ఆస్తులను, పంటలను కాపాడుతుందని ప్రజలు విశ్వసిస్తారు.
ఈ పండగ చేయడం వల్ల గ్రామానికి ఎలాంటి కీడు జరగదని నమ్ముతారు. ప్రకృతి విపత్తులు, రోగాలు, దుష్ట శక్తులు ఊరిలోకి రాకుండా గ్రామదేవత కాపలా ఉంటుందని భావిస్తారు. ఈ పండగ గ్రామంలో శాంతి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు నింపుతుందని ప్రజల నమ్మకం. కొత్త గ్రామాన్ని స్థాపించినప్పుడు లేదా పాత గ్రామానికి కొత్త శక్తిని ఇవ్వడానికి ఈ పండగను నిర్వహిస్తారు.
బొడ్రాయిని ఊరి మధ్యలో ప్రతిష్టించడం వెనుక కూడా కొన్ని ముఖ్యమైన కారణాలు, నమ్మకాలు ఉన్నాయి. ఊరి మధ్యలో అంటే ఆ గ్రామం గుండెకాయ లాంటిది. అక్కడ బొడ్రాయిని ప్రతిష్టించడం అంటే గ్రామదేవత ఊరి మధ్యలో నిలబడి అన్ని వైపుల నుంచి గ్రామాన్ని కాపాడుతున్నట్టు. బొడ్రాయి ఒక శక్తి కేంద్రం. ఆ శక్తి అక్కడి నుంచి గ్రామం మొత్తం వ్యాపిస్తుంది. దాని ద్వారా ఊరి సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి.
గ్రామం మధ్యలో ఉండడం వల్ల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానిని దర్శించుకోవడానికి, పూజలు చేయడానికి సులభంగా ఉంటుంది. పండగల సమయంలో గ్రామస్తులు అందరూ అక్కడ గుమిగూడటానికి ఇది ఒక కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. బొడ్రాయి కేవలం ఒక రాయి కాదు, అది ఆ గ్రామం ఆత్మ. అది గ్రామ ప్రజల నమ్మకాలకు, సంస్కృతికి ప్రతీక.