
లక్ష్మీ దేవి సోదరిగా పారిజాత వృక్షం: పౌరాణిక కథల ప్రకారం, దేవతలు-అసురులు కలిసి చేసిన సముద్ర మథనం సమయంలో సముద్రం నుండి 14 రత్నాలు ఉద్భవించాయి. అందులో లక్ష్మీ దేవి ఒకరైతే, పారిజాత వృక్షం మరొకటి. ఒకే సమయంలో సముద్రం నుండి జన్మించడం వల్ల పారిజాతాన్ని లక్ష్మీ దేవికి సోదరి లాంటిదని చెబుతుంటారు. అందుకే ఈ చెట్టుకు కాసే పువ్వులన్నా, వాటి సువాసనన్నా లక్ష్మీ దేవికి అమితమైన ఇష్టం. ఈ పువ్వులతో పూజ చేసే వారి ఇంట లక్ష్మీ దేవి శాశ్వతంగా కొలువై ఉంటుందని నమ్ముతారు.

కింద పడిన పువ్వులతో పూజ చేయవచ్చా?: హిందూ శాస్త్రాల ప్రకారం, సాధారణంగా చెట్టు నుండి కింద పడిన పువ్వులను దేవుడి పూజకు ఉపయోగించకూడదు. వాటిని నిర్మాల్యంగా భావిస్తారు. కానీ, ఈ నియమానికి పారిజాత పుష్పాలు ఒక పెద్ద మినహాయింపు.

పారిజాత పువ్వులను చెట్టు నుండి తెంచకూడదని, కేవలం రాత్రి వేళల్లో వికసించి తెల్లవారుజామున స్వయంగా కింద రాలిన పువ్వులను మాత్రమే సేకరించి పూజకు ఉపయోగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కింద పడిన పారిజాత పూలతో పూజ చేసినా అది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

పారిజాత పూజ వల్ల కలిగే ప్రయోజనాలు: లక్ష్మీ పూజలో లేదా దీపావళి వంటి పర్వదినాల్లో లక్ష్మీ దేవి పాదాల చెంత పారిజాత పువ్వులను ఉంచి పూజించడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి, ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. శుక్రవారం నాడు లక్ష్మీ దేవికి ఐదు పారిజాత పువ్వులను సమర్పించి, పూజ తర్వాత వాటిని ఒక పసుపు గుడ్డలో కట్టి బీరువాలో లేదా డబ్బులు దాచే స్థలంలో ఉంచితే సంపద పెరుగుతుందని నమ్ముతారు.

పారిజాత పువ్వుల సువాసనకు ఒత్తిడిని దూరం చేసే శక్తి ఉంది. ఈ పువ్వులు ఉన్న ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ ఇంట్లో కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలంటే, లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పారిజాత పుష్పాలను ఉపయోగించడం మర్చిపోకండి.