
హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసి ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. డబ్బుకు కొరత ఉండదని నమ్మకం. హిందూ మతంలో తులసి మొక్క విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. అందువల్ల తులసి ఉన్న ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని విశ్వసిస్తారు. అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు తక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లో సానుకూల, ప్రతికూల శక్తులు ఉంటాయి. ప్రతికూల శక్తి పెరిగితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. కానీ, తులసి మొక్క ఉండటం వల్ల ఆ ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుంది. దీని వల్ల కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయి.

తులసి పూజ విధానం.. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీళ్లు పోసి పూజ చేయాలి. అయితే ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసికి నీళ్లు పోయకూడదని ఆచారం చెబుతుంది. అలాగే సాయంత్రం సమయంలో తులసి ఆకులు కోయకూడదు. తులసి పూజను ప్రతిరోజూ భక్తితో చేస్తే, ఇంట్లో వాస్తు దోషాలు తగ్గి, విష్ణు, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం.

తులసి దగ్గర దీపం వెలిగించడం.. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముందుగా అగరబత్తి వెలిగించి, తర్వాత తులసి దగ్గర నూనె దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీపం తులసి వైపు ఉండాలి, కానీ దక్షిణ దిశ వైపు ఉండకూడదు. దీపం వెలిగించిన తర్వాత పువ్వులు సమర్పించవచ్చు.

ఈ తప్పులు చేయొద్దు.. సాయంత్రం తులసి ఆకులు కోయవద్దు, తులసి ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి, తులసి దగ్గర చెప్పులు, బూట్లు ఉంచకూడదు, ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసికి నీళ్లు పోయకూడదు ఈ విధంగా తులసి పూజను నియమితంగా చేస్తే, ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, శాంతి, సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)