
ఆరు నెలల క్రితం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ హాస్టల్లోని బాత్రూమ్లో మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన 11 ఏళ్ళ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే అప్పటి నుంచి తమకు న్యాయం జరగలేదని విద్యార్థి తల్లిదండ్రుల, బంధువులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. తాజాగా తమకు అన్యాయం చేసిన స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తౌశిక్ తల్లి కోచింగ్ సెంటర్ ఎదుట పది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని హైకోర్టును తల్లిదండ్రులు ఆశ్రయించగా నెల్లూరు పోలీసులను విచారణ చేయాల్సిందిగా ఆదేశించిన హైకోర్టు ఆదేశించడంతో ఆ విచారణ కూడా పూర్తి చేశారు. ఆ సమయంలో సింగరాయకొండలో పనిచేస్తున్న పోలీసులపై ఆరోపణలు రావడంతో వారిని అక్కడి నుంచి బదిలీ చేశారే కానీ, కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని హత్య కోణంలో విచారణ చేయకుండా పోలీసులు విద్యార్ధిది ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లి మౌలాబి ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాల్సిందేనంటూ పదిరోజులుగా తిరిగి మూలగుంటపాడులోని కోచింగ్ సెంటర్ ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నారు.

స్కూలుకు అనుమతి లేకపోయినా క్లాసులు నిర్వహిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని, రాజకీయ నేతల ఒత్తిడి పై ప్రశ్నిస్తూ తౌశిక్ తల్లి మౌలాబి ఆందోళన చేపట్టారు... కోచింగ్ సెంటర్కు ఎలాంటి అనుమతులు లేవని, విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తరువాత కూడా కోచింగ్ సెంటర్ను విద్యాశాఖ అధికారులు మూయించలేదని ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... డిఈవోను ప్రశ్నిస్తే తమను అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు... కనిగిరిలో ఓ ప్రయివేటు స్కూల్లో అడ్మిషన్ తీసుకుని చదువుతున్న విద్యార్థి తౌషిక్ ను సింగరాయకొండ దగ్గర అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య నవోదయ స్కూల్ కోచింగ్ సెంటర్లో ఉంచి మంచి మార్కులు తెప్పిస్తామని నమ్మబలికి తమ బిడ్డ ప్రాణాలు తీశారన్నది విద్యార్థి తల్లిదండ్రుల ప్రధాన ఆరోపణగా ఉంది... అప్పటినుంచి న్యాయం కోసం తల్లి మౌలాబి పోరాడుతూనే ఉన్నారు.

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు దగ్గర నిర్వహిస్తున్న శ్రీ చైతన్య నవోదయ స్కూల్ కోచింగ్ సెంటర్ విద్యాశాఖ కార్యాలయంలో ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ నేపధ్యంలో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి చెందిన తరువాత కోచింగ్ సెంటర్ నిర్వహించేందుకు ఉన్న అనుమతులను చూపించాలని కోరుతూ సింగరాయకొండ ఎంఈఓ కత్తి శ్రీనివాసులు యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చారు... అయితే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం, కొంతమంది ప్రజా ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో ఇటు పోలీసులు, అటు విద్యాశాఖ అధికారులు కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం అటుంచి, ఈ వ్యవహారంపై బాధితులనే బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిణామాలను జీర్ణించుకోలేని తౌషిక్ తల్లి మౌలాబి పది రోజులుగా కోచింగ్ సెంటర్ ఎదుట ఒంటరిగానే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు... తన బిడ్డ మృతిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థి తల్లి మౌలాబి రెండు రోజుల క్రితం కోచింగ్ సెంటర్ ఎదుట పురుగుల మందు తాగారు... తీవ్రంగా అస్వస్థతకు గురైన మౌలాబిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆమె మృతి చెందారు. దీంతో తల్లీ, కొడుకుల మృతికి కారకులైన కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె బంధువులు జనసేన నాయకుల ధర్నా చేశారు... పాకల రోడ్డు నుండి కందుకూరు సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు... అనుమతి లేని కోచింగ్ సెంటర్ను మూసివేయాలని డిమాండ్ చేశారు... దోషులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.

కనిగిరికి చెందిన విద్యార్ధి తౌఫిక్ ది ఆత్మహత్య కాదని హత్యేనంటూ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పలు మార్లు ఆరోపణలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పదిరోజులుగా విద్యార్ధి తల్లి మౌలాబి మూలగుంటపాడులోని కోచింగ్ సెంటర్ ఎదుట ఒంటరిగా కూర్చుని నిరసన దీక్షలు చేస్తుంటే పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్టో అర్ధం కావడం లేదు... ఒకవేళ చట్టపరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, కేసు కోర్టులో ఉందని బాధితురాలికి పోలీసులు ఎందుకు వివరించలేకపోయారు... అసలు ఎలాంటి అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్న యజమాని ప్రవర్తనపై పలు ఆరోపణలు ఉన్నా, ఆ కోణంలో ఎందుకు విచారించలేదన్న సందేహాలు కలుగుతున్నాయి... ఇంత జరుతుగున్న స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బాధిత కుటుంబాన్ని కలిసి ఎందుకు భరోసా కల్పించలేకపోయారన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న... రాష్ట్రంలో ఏ మూల ఏం దారుణం జరిగినా వెంటనే స్పందించే ప్రభుత్వం ఈ తౌషిక్ మృతి విషయంలో మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకోలేదో అర్ధం కావడంలేదని ముస్లిం ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ మృతికి కారకులైన వారిని శిక్షించేలా చేసేందుకు తల్లి మౌలాబి చేసిన పోరాటాలు విఫలం కావడంతో జీవతంపై విరక్తి చెంది ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం ప్రజాస్వామ్మ ప్రభుత్వాలకు సిగ్గుచేటని విద్యార్ధి, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే తాను చనిపోతే తన మృతదేహాన్ని తన బిడ్డ సమాధి పక్కనే పాతి పెట్టాలని ఆత్మహత్య చేసుకునే ముందు ఆ తల్లి అందర్నీ వేడుకోవడం. తల్లీ, బిడ్డల మృతితోనైనా ప్రభుత్వాలు కదులుతాయా..అనుమతి లేని కోచింగ్ సెంటర్ను మూసివేస్తారా... ఏం చేస్తారో చూడాలి...