
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీలు తమ అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియాను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారు. అయితే, నిరంతర ఆన్లైన్ ప్రెజెన్స్ కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి కొంతమంది తారలు డిజిటల్ డిటాక్స్ (Digital Detox) వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరారు ప్రముఖ నటి కాయదు లోహర్. 'డ్రాగన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె, తాజాగా సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

జీవితంలో రోజూ ఎదుర్కొనే మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి, అలాగే ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాయదు తెలిపారు. ఈ విషయమై ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రత్యేకమైన పోస్ట్ను పంచుకున్నారు. "సోషల్ మీడియా నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. సాధారణంగా మనం అలసిపోయినప్పుడు శరీరానికి విశ్రాంతి ఇస్తాం, అదే విధంగా మన మనసుకూ విశ్రాంతి అవసరం. అందుకే స్క్రీన్కు, డిజిటల్ ప్రపంచానికి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాతో నేను ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాను" అని కాయదు తన పోస్ట్లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన అభిమానులకు, నెటిజన్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "నాకు నిరంతరం మద్దతుగా నిలిచి, నన్ను ప్రోత్సహించి, ఎనలేని ప్రేమను చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ సందేశాలు, మీరు చూపించే ఆదరణ నాకు ఎంతో విలువైనవి. నేను వ్యక్తిగతంగా కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, నా సినిమాలకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన అధికారిక అప్డేట్స్ ఉంటే, నా టీమ్ ఈ అకౌంట్ ద్వారా వాటిని షేర్ చేస్తుంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం" అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కాయదు లోహర్ ప్రస్తుతం వైవిధ్యమైన ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె జీవీ ప్రకాష్ హీరోగా, మరియప్పన్ చిన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇమ్మోర్టల్' అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ విరామం తర్వాత ఆమె మరింత ఉత్సాహంతో, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు తెలుగులోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే తమిళంలో ప్రైవట్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బ్రేక్ తీసుకోవడం గమనార్హమే.

కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. కయాదు లోహర్ తన కెరీర్ను మోడలింగ్తో ప్రారంభించారు. 'ఎవరీయూత్ ఫ్రెష్ ఫేస్ (సీజన్ 12)' పోటీలలో విజేతగా నిలిచిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. 2021లో వచ్చిన కన్నడ చిత్రం 'ముగిల్పేటే' (Mugilpete) ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. 2022లో శ్రీవిష్ణు కథానాయకుడిగా వచ్చిన పోలీస్ యాక్షన్ డ్రామా 'అల్లూరి' (Alluri) చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టారు.