
తక్కువ ధరలో సురక్షితమైన రవాణౄ సేవలు అందించే వాటిలో రైల్వే మొదటి వరుసలో ఉంటుంది. అందుకే ఎక్కవ మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారు.

ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైల్వేకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇండియన్ రైల్వే వల్ల కోట్లాది మందికి ఉపాధి లభిస్తోంది. ప్రతి రోజూ ప్రయాణించే లక్షలాది మందికి రక్షణ కల్పించడంలో రైల్వే శాఖ పెద్ద పీట వేస్తుంది.

ఇందులో భాగంగానే రైళ్లలో ప్రయాణించే సమయంలో కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే రైల్వే శాఖ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సిందే.

రైలులో ప్రయాణించే సమయంలో క్రాకర్స్, గ్యాస్ సిలిండెర్, సిగరెట్లు, గన్పౌడర్ లాంటి పేలుడు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదు. అంతేకాకుండా రైళ్లలో కిరోసిన్, పెట్రోల్ వంటి మండే వస్తువుల రవాణ కూడా చట్ట విరుద్దం.

అలాగే రైల్వే కంపార్ట్మెంట్ లేదా స్టేషన్లో పొగ తాగడం నిషేధించారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్లు 164, 165 ప్రకారం రైలులో ప్రయాణించే సమయంలో పేలుడు పదార్థాలను రవాణా చేస్తే రూ. 1000 వరకు జరిమానా లేదా మూడేళ్లు జైలు శిక్ష.. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశాలు ఉంటాయి.