
మన దేశంలో ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి పౌరుడి జీవితంలో కీలక గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకింగ్, మొబైల్ కనెక్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లావాదేవీలు వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆధార్ వినియోగం పెరిగిన కొద్దీ గుర్తింపు చోరీ, బయోమెట్రిక్ డేటా దుర్వినియోగం వంటి ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వినియోగదారులకు ఒక కీలక భద్రతా సదుపాయాన్ని అందిస్తోంది. మై ఆధార్ పోర్టల్ ద్వారా మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సంస్థ ద్వారా ఉపయోగించబడిందో సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ సేవను ఉపయోగించాలంటే ముందుగా మైఆధార్ పోర్టల్లోకి వెళ్లి ఆధార్ నంబర్తో లాగిన్ కావాలి. రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత “అంథేన్టికేషన్ హిస్టరీ” విభాగంలోకి వెళ్లాలి. అక్కడ గత ఆరు నెలల వరకు తేదీలను ఎంపిక చేసి బయోమెట్రిక్, ఓటీపీ లేదా రెండింటి ఆధారంగా జరిగిన ధృవీకరణ వివరాలను పరిశీలించవచ్చు.

ఈ నివేదికలో ఆధార్ ధృవీకరణ ఎలా జరిగింది, తేదీ, సమయం, అలాగే ఏ బ్యాంకు, టెలికాం సంస్థ లేదా ప్రభుత్వ కార్యాలయం ఆధార్ను ఉపయోగించిందనే వివరాలు కనిపిస్తాయి. మీకు తెలియని లేదా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావచ్చు.

భద్రతను మరింత పెంచేందుకు UIDAI బయోమెట్రిక్ లాక్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. మైఆధార్ పోర్టల్ లేదా mAadhaar యాప్ ద్వారా వేలిముద్రలు, ఐరిస్ వివరాలను లాక్ చేయవచ్చు. దీంతో మీ అనుమతి లేకుండా ఎవరూ బయోమెట్రిక్ ఆధారిత ధృవీకరణ చేయలేరు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం గుర్తిస్తే వెంటనే UIDAI హెల్ప్లైన్ 1947కు ఫోన్ చేయాలి లేదా అధికారిక పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి. అలాగే బయోమెట్రిక్లను తక్షణమే లాక్ చేయడం మంచిది.

నిపుణుల సూచనల ప్రకారం ఆధార్ ప్రామాణీకరణ చరిత్రను తరచూ పరిశీలించడం ద్వారా మోసాలను ముందుగానే గుర్తించి, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇది డిజిటల్ యుగంలో ప్రతి ఆధార్ వినియోగదారుడు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తగా మారుతోంది.