ఎస్ఎంఎస్ చూశాడు.. 14 లక్షలు పోగొట్టుకున్నాడు
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. పలువురి అకౌంట్లపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు లక్షలను కొట్టేస్తున్నారు.
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. పలువురి అకౌంట్లపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు లక్షలను కొట్టేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఒకటి, రెండు కాదు అతడికి చెందిన రూ.14 లక్షలను దుండగులు కొట్టేశారు. దీంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహిబ్ సెల్ఫోన్కి ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ గ్రీన్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు ఆ ఎస్ఎంఎస్లో ఈ–మెయిల్ ఐడీ కూడా ఉంది. తమ వద్ద ఉన్న సొమ్ముతో భారత్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు ఓ మహిళ ఈ మెయిల్ను పంపింది. దానికి స్పందించిన సోహిబ్ తన వివరాలను ఆ మెయిల్కు పంపాడు. ఈ క్రమంలో సోహిబ్కి 10 మిలియన్ డాలర్లు పంపిస్తున్నట్లు మెయిల్ నుంచి సందేశం వచ్చింది. ఇది జరిగిన రెండు రోజుల తరువాత తాము ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులమని చెబుతూ కొందరు నేరగాళ్లు సోహిబ్కి ఫోన్ చేశారు. పార్సిల్లో వచ్చిన డబ్బు విషయం చెప్పి వివిధ రకాల పన్నుల పేరుతో అతడి వద్ద నుంచి రూ.14 లక్షలు కాజేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసును నమోదు చేసుకొని దర్యాప్తును చేస్తున్నారు.