ప్రేమ అనేది భాగస్వామికి, ప్రేమికులకు మాత్రమే పరిమితం కాదు. తల్లి ప్రేమ అంతకన్నా ఎక్కువ. ఇందుకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది ఇక్కడ ఒక సంఘటన.
తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన తల్లిపై ప్రేమతో తాజ్మహల్ను తలపించే భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ఈ స్మారకం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది.
వ్యాపారవేత్త అమృతిన్ షేక్ దావూద్ తల్లి జైలానీ భివి 2020లో మరణించారు. తన బిడ్డల కోసం తల్లి త్యాగానికి చిహ్నంగా, ఆమె జ్ఞాపకార్థం ఒక ఆర్కిటెక్ట్ను నియమించి రాజస్థాన్లోని తెల్లని పాలరాయితో తాజ్ మహల్ లాంటి భవనాన్ని నిర్మించారు.
షేక్ దావూద్ స్మారక చిహ్నం తన తల్లి త్యాగం, ప్రేమకు ప్రతీక అని, తన తండ్రి మరణం తర్వాత తనను, తన నలుగురు సోదరీమణులను ఒంటరిగా పెంచారని పేర్కొన్నారు.
2020లో జైలానీ బీవీ కన్నుమూశారు. ఈ ఘటనతో అమరుద్దీన్కు పెద్ద షాక్ తగిలినంత పనైంది. అతను తన తల్లికి ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడు. చిన్నతనం నుంచి తన తల్లికి దుకాణంలో సహాయంగా ఉండేవాడు. ఎప్పుడూ తల్లివెంటే తిరుగుతూ ఉండేవాడు. ఆమె అమావాస్య రోజున మరణించింది. దాంతో అతడు ప్రతి అమావాస్య రోజున 1,000 మందికి బిర్యానీతో విందు చేయాలని నిర్ణయించుకున్నాడు.
అతను రాజస్థాన్ నుండి పాలరాయిని కొనుగోలు చేశాడు. ఆగ్రాలోని తాజ్ మహల్లో వలె స్మారక చిహ్నం చుట్టూ ద్వారాలు ఏర్పాటు చేశాడు. జూన్ 2న స్మారక చిహ్నాన్ని ప్రజల సందర్శనార్థం ప్రారంభించాడు. ఇది అన్ని మతాల ప్రజలు ధ్యానం చేయగల ధ్యాన కేంద్రాలు, ప్రస్తుతం 10 మంది విద్యార్థులు ఉంటున్న మదర్సాను ఏర్పాటు చేశారు.