మహిళల ఆర్థిక స్వావలంభనకు మరో కొత్త పథకం.. జీహెచ్ఎంసీలో త్వరలో రోడ్డెక్కనున్న చేపల వంటకాలు
తెలంగాణలో మహిళల ఉపాధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. గ్రామాల్లో మత్స్యకారులకు ఇప్పటికే..
తెలంగాణలో మహిళల ఉపాధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. గ్రామాల్లో మత్స్యకారులకు ఇప్పటికే టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు సబ్సిడీ మీద అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో జీహెచ్ఎంసీలో మహిళల కోసం ఓ కొత్త పథకం తీసుకొచ్చింది. చేపలు, చేపల వంటకాల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాహనం ఖరీదు రూ.10 లక్షలు కాగా, ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో అందజేయనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతో పాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంభన పొందేలా చేయడమే ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.