Minister Botsa Satyanarayana: ఇలాంటి వైఖరిని నేనెప్పుడూ చూడలేదు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి బొత్స ఫైర్..
Minister Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Minister Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆయన తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదే సమయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ వెనుక రాజ్యాంగేతర శక్తి ఉందనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుందన్నారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వద్దంటూ ఉద్యోగ సంఘాలు, ప్రజలు కోరుతున్నారని అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లల్లో ఎన్నికల సంఘం ఈ తరహా వైఖరిని అవలంబించడం ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్ఫూర్తికి భిన్నంగా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రకటనలు చేయడం శోచనీయం అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ 20 తేదీ వరకు పొడిగించామని మంత్రి బొత్స ప్రకటించారు. ఈనెల 11న అమ్మ ఒడి పెట్టుకున్నామని, ఈలోగా ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారని ఎస్ఈసీని మంత్రి బొత్స ప్రశ్నించారు. కేంద్రం నిధుల సమస్య లేదని, ఎన్నికలు నెల రోజులు ఆలస్యమైతే వచ్చే ఇబ్బంది ఏంటని ఆయన నిలదీశారు. సంక్షోభ సమయంలో పంతాలు, పట్టింపులు అవసరమా? అని అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీల వ్యవహరిస్తోందంటూ మంత్రి బోత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోటల్కు వెళ్లి రాజకీయ పార్టీ నేతలతో ఎన్నికల కమిషనర్ కలవడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపైనా మంత్రి బొత్స మండిపడ్డారు. ఏం చేశారని చంద్రబాబు ఎన్నికలను స్వాగతిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 95 శాతం ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాల్సిందే అని, ఆ దిశలో ముందుకు వెళ్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను న్యాయస్థానాలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. సంక్షేమం కోసం చేపట్టే ఇళ్ల పట్టాల పంపిణీకి దురుద్దేశంతో చేపట్టే ఎన్నికలతో టీడీపీ నేతలు పోల్చి చూడటం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఇందులో తమకు ఏ లబ్ధి లేదన్న ఆయన.. ఎన్నికల తర్వాత తాము తప్ప అన్ని పార్టీలు మట్టికొట్టుకుపోతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also read: