మహారాష్ట్రలో కొత్తగా 15,738 మందికి కరోనా
దేశంలో కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతూనే ఉంది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర అదే పంథా కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా నిత్యం 15 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతూనే ఉంది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర అదే పంథా కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా నిత్యం 15 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనూ అదే తీరు కొనసాగుతుంది. కొత్తగా 15,738 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 12,24,380కి చేరుకుందని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, గత 24 గంటల్లో నమోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని తెలిపింది. సోమవారం 32,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,16,348కి చేరింది.
ఇక కరోనా మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో భారీగానే ఉంటుంది. గత 24 గంటల్లో కొత్తగా 344 మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మహారాష్ట్ర వ్యాప్తంగా 33,015 మంది కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఒక్క ముంబైలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,150కి చేరింది. అందులో ప్రస్తుతం 26,735 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ముంబైలో కరోనా మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. ముంబైలో ఇప్పటి వరకు 8,502 మంది కరోనాతో చనిపోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.